ధర్మసంసద్ లో ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు-విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా డిసెంబర్లో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగిన ఓ ధరమ్ సంసద్ సదస్సులో పాల్గొన్న సాధువు యతీ నరసింఘానంద్ తో పాటు పలువురు ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది.
హరిద్వార్ ధరమ్ సంసద్ సదస్సులో ముస్లిం విద్వేష వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. ధర్మ్ సంసద్ ద్వేషపూరిత ప్రసంగ అంశం చాలా ప్రమాదకరమని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైనా ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని, అరెస్టు కూడా చేయలేదని కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
డిసెంబరు 17 నుండి డిసెంబర్ 19 వరకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగిన మూడు రోజుల ధరం సంసద్ సభలో మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే, మతపరమైన ప్రసంగాలు చేశారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పలువురు హిందూ మత పెద్దలు, ఆయుధాలు చేపట్టాలని సమాజానికి పిలుపునిచ్చారు. ముస్లింలకు వ్యతిరేకంగా వారు 'హిందూ దేశం' కోసం స్పష్టమైన పిలుపు ఇచ్చారు.
ఈ సమావేశంలో యతి నర్సింహానంద్ ముస్లింల నుంచి ఎదురయ్యే ముప్పుకి వ్యతిరేకంగా "హిందూ బ్రిగేడ్కు భారీ ఆయుధాల్ని అందించడమే పరిష్కారమని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్ధానిక బీజేపీ సర్కార్ కఠినంగా వ్యవహరించలేదని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపబోతోంది.