టీ అమ్ముకునే వ్యాపారి వద్ద రూ.650 కోట్లు, లెక్కించాక మరింత..
గుజరాత్లోని సూరత్కు చెందిన టీ అండ్ స్నాక్స్ అమ్ముకునే వ్యక్తి కిషోర్ భాజివాలా వద్ద రూ.650 కోట్ల లెక్కలోకి రాని ధనం ఉన్నట్లుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు.
సూరత్: గుజరాత్లోని సూరత్కు చెందిన టీ అండ్ స్నాక్స్ అమ్ముకునే వ్యక్తి కిషోర్ భాజివాలా వద్ద రూ.650 కోట్ల లెక్కలోకి రాని ధనం ఉన్నట్లుగా ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. కిషోర్ వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటాడు.
దోపిడీలు, దొంగతనాలు: నోట్ల రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం!
అతని వద్ద ఉన్న ఆస్తిని లెక్కించడానికి ఐటీ శాఖ అధికారులకు రోజుల తరబడి సమయం పడుతోంది. అతడి మొత్తం ఆస్తి రూ. 650 కోట్లని ఇప్పటికి లెక్క తేల్చారు. కిషోర్ భజియావాల, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులందరి వద్ద కలిసి గుర్తించిన ఆస్తి విలువ రూ. 650 కోట్లకుపైగా ఉందని సీనియర్ అధికారి ఒకరు చెబుతున్నారు.
అతడి వద్ద 50 కిలోల వెండి, రూ. 1.39 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 6.5 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయని, వీటన్నింటినీ పలు లాకర్లలో పెట్టి దాచి పెట్టాడని చెప్పారు. దాదాపు వారం రోజుల నుంచి అతడి బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటినీ ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే అతను తన ఖాతాల్లో రూ.కోటికి పైగా డిపాజిట్ చేశాడు. అనుమానం వచ్చిన అధికారులు అతడి పైన నిఘా వేశారు. దీంతో అతడి వ్యవహారం బయటపడింది. కిషోర్ భజియావాలా, అతడి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 40కి పైగా బ్యాంకు అకౌంట్లున్నాయి.
అతడి ఆదాయం లెక్క ఇప్పుడు బయటపడిన రూ.650 కోట్లతోనే ఆగకపోవచ్చని, లెక్కింపు పూర్తయ్యేసరికి మరింత పెరిగే అవకాశముందంటున్నారు. సూరత్ శివార్లలోని ఉధ్నా అనే ప్రాంతంలో టీ, స్నాక్స్ మాత్రం అమ్ముకునే ఈ భజియావాలా గత మూడు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాడు.
దశాబ్ద కాలం నుంచి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టి అందులో భారీగా సంపాదించాడు. ఇతగాడి నెల సంపాదనే దాదాపు రూ. 15 కోట్ల వరకు ఉంటుంది గానీ, సంవత్సరానికి తాను కేవలం కోటిన్నర మాత్రమే సంపాదిస్తున్నట్లు ఐటీ రిటర్నులలో చూపించాడని తెలుస్తోంది.