Surya Grahanam రోజున గర్భిణీలు వాటికి దూరంగా ఉండాలి: ఏం చేయాలి ఏం చేయకూడదు..?
శనివారం డిసెంబర్ 4వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. గ్రహణం అనేది మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణం రోజున పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఇక డిసెంబర్ 4వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఆకాశంలో కనిపించనుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలని ఈ కథనంలో తెలుసుకుందాం.

సూర్య గ్రహణం అంటే ఏంటి..?
ముందుగా సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. దీన్నే సూర్యగ్రహణం అంటాం. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో చంద్రడు వచ్చిన సమయంలో చంద్రుడికి సంబంధించిన నీడ భూమిపై పడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. దీన్నే అంబ్రా అని పిలుస్తాము. సూర్యుడి బాహ్య ప్రాంతంను మాత్రమే అడ్డుకుంటే పెనంబ్రా అని ఇంగ్లీషులో పిలుస్తాము. సంపూర్ణ సూర్యగ్రహణం రోజున చంద్రుడు మొత్తం సూర్యుడికి అడ్డుగా ఉంటుంది. అదే పాక్షిక సూర్యగ్రహణం రోజున సూర్యుడిలో ఒక భాగం మాత్రమే చంద్రుడు అడ్డుకుటుంది.

మూసుకోనున్న ఆలయ ప్రధాన ద్వారాలు
ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 4 శనివారం ఏర్పడుతుంది. ఉదయం 10 గంటల 59 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 7నిమిషాలకు ముగుస్తుంది. ఈ సమయంలో అన్ని ఆలయాల ప్రధాన ద్వారాలు మూసివేయడం జరుగుతుంది.ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. హిందూ మతవిశ్వాసం ప్రకారం సూర్యగ్రహణం మంచి రోజు కాదు. సూర్యదేవతపై రాహు కేతువుల గ్రహణం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం పై గ్రహణ ప్రభావం ఉంటుందని చెప్తారు.

గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..?
హిందూ మత విశ్వాసం ప్రకారం సూర్యగ్రహణ సమయంలో గర్భిణీలు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకూడదు. ఒకవేళ బయటకు వెళితే తల్లి చర్మంపై గ్రహణ ప్రభావం ఉంటుందని అదే సమయంలో కడుపులోని బిడ్డపై కూడా సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన కిరణాలు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సూర్యగ్రహణం రోజున భూమిపై పడే నీడకు గర్భిణీలు దూరంగా ఉంటే చాలా మంచిదని చెబుతున్నారు. ఇక సూర్యగ్రహణం ముగిసిన తర్వాత గర్భిణీ స్త్రీలు వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది. గ్రహణం నుంచి సంభవించే అన్ని అనర్థాలు స్నానం చేస్తే పోతాయని చెబుతున్నారు.

పదునైన వస్తువులకు దూరంగా ఉండాలా..?
గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవడం ఎంతమాత్రం మంచిదికాదట. అయితే గర్భిణీలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. అలా అని ఏదీ తినకుంటే అది తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులు అంటే కత్తి, బ్లేడ్, కత్తెర, పిన్స్, సూదులు లాంటివి వినియోగిస్తే అది కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతున్నారు. ఇక గ్రహణ సమయంలో సూర్యుడిని నేరుగా చూసే ప్రయత్నం ఎంతమాత్రం చేయొద్దని సూచిస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక గ్రహణ సమయంలో గర్భిణీలు శివ మంత్రాన్ని జపించడం ఉత్తమం. లేదా ఇష్టదైవానికి పూజలు చేస్తే మరీ మంచిదని పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications