హైద్రాబాద్పై సుష్మా: లగడపాటి చెప్పిన నేత బొత్సనా?
న్యూఢిల్లీ: హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసి గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ మంగళవారం ఆరోపించారు. తెలంగాణ విషయంలో బిజెపి వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. కాంగ్రెసు పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మండిపడ్డారు.
ప్రధానమంత్రి అధ్యక్షతన తెలంగాణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దానిని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఇరు ప్రాంతాల వారిని ఏకతాటి పైకి తేవడంలో కాంగ్రెసు పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. పార్లమెంటు నడిస్తే బిల్లుల పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు.
హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసి గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తోందని ఆరోపించారు. ఇందుకు పార్లమెంటులో సవరణలు, ఓటింగ్ జరగాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తాము ఎన్నికల ప్రచారం చేస్తామన్నారు.
లగడపాటి వర్సెస్ బొత్స
ఢిల్లీలోని ఓ హోటల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కాంగ్రెసు పార్టీకి చెందిన 'ఓ ముఖ్య నాయకుడు' మంతనాలు జరిపినట్లుగా విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. లగడపాటి పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణను ఉద్దేశించి అన్నారని చెబుతున్నారు. దీనిపై బొత్సను ప్రశ్నిస్తే.. ఆయన ఖండించారు. తనకు ఎవరితోను లోపాయికారి ఒప్పందం లేదని, అంత అవసరం లేదని ఆయన చెప్పారు. ఆ విషయం లగడపాటినే అడగాలని సూచించారు.
కాగా, భాషాప్రయుక్త రాష్ట్రాలను కాంగ్రెసు విడదీస్తోందని లగడపాటి అంతకుముందు ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెడితే సమావేశాలు అడ్డుకుంటామన్నారు. ముఖ్యమంత్రితో పాటు తాము దీక్షలో కూర్చుంటామని చెప్పారు. కేంద్రం ఇష్టానుసారంగా విభజన చేస్తోందన్నారు.