ఇన్ఫోసిస్ స్వాతి హత్య కేసు: తెరపైకి సూర్య ప్రకాశ్, ఎవరతను?
చెన్నై: సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్ కుమార్ను చెన్నై నగర పోలీసులు అరెస్ట్ చేసి కేసు పని అయిపోయిందని పోలీసులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుండగా, కొన్ని ప్రశ్నలు వాటి వెనుక అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి.
కిల్లర్ను ఉరితీయండి: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి పేరెంట్స్
ఆ ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు చెప్పకుండా దాట వేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా అడుగుతున్న ప్రశ్నలు, ప్రధాన సాక్షి, నిందితుడి వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే అనుమానం కలుగుతోంది.
టెక్కీ స్వాతి హత్యను తనకు 50 గజాల దూరంలోనే జరిగిందని, తాను ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని చూశానని తమిల్ సెల్వం అనే కాలేజీ ప్రొఫెసర్ వాంగ్మూలం ఇచ్చాడు. జూన్ 24న స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని చూశానని, అతడు.. ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒక్కరు కాదని పేర్కొన్నారు.
అయితే, స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేదు. దీనిపై స్పందించేందుకు కూడా నిరాకరించారు. చెన్నై పోలీసు కమిషనర్ టీకే రాజేంద్రన్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వాతి హత్య కేసులో నిందితుడు ఒక్కడేనని చెప్పారు.
మరోవైపు స్వాతి ఇంటికి సమీపంలో రామ్ కుమార్తోపాటు 404 రూమ్లో రూమ్మేట్గా ఉన్న ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డు నటేశాన్ కనిపించకుండా పోయాడు. దీనిపై పోలీసులను ప్రశ్నించగా అతడు పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, ఈ హత్య కేసులో అతడే ప్రధాన సాక్షి కాబట్టి రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
ఒక వేళ నటేశాన్కు స్వాతి హత్య చేయబోయే విషయం గురించి ముందే తెలిసుంటే పోలీసులకు ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదని, నిందితుడి కోసం తొలుత పోలీసులు గడపగడప తిరిగి అడిగినా ఎందుకు అతడు వివరాలు అందించలేదని మరో ప్రశ్న తలెత్తుతోంది.
తాజాగా స్వాతి హత్యకేసులో సూర్య ప్రకాశ్ అనే మరో పేరు తెరపైకి వచ్చింది. సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ద్వారానే స్వాతితో తనకు పరిచయం అయిందని, మా ఇద్దరి మధ్య సూర్య ప్రకాశ్ మధ్యవర్తిగా ఉన్నాడని పోలీసుల విచారణలో రామ్ కుమార్ చెప్పాడు.
స్వాతి కిల్లర్ కలెక్టర్ కావాలని కల గన్నాడు
అయితే నిజానికి రామ్ కుమార్ చెప్పినట్టు సూర్య ప్రకాశ్ ఫేస్బుక్ ప్రెండ్స్ లిస్ట్లో సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి లేడు. అసలు ఇంతకీ ఆ సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ఎవరు? అతడు అసలు ఉన్నాడా లేడా అనే విషయం పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది.
రామ్ కుమార్కు స్వాతిని సూర్య ప్రకాశే పరిచయం చేసి ఉంటే స్వాతి హత్య జరిగిన తర్వాత సూర్య ప్రకాశ్ ఎందుకు పోలీసులను ఆశ్రయించలేదని ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. దీనిని బట్టి చూస్తుంటే టెక్కీ స్వాతి హత్య కేసులో చిక్కుముడులు ఇంకా వీడనట్లే కనిపిస్తోంది.