వీడియో: స్టాలిన్కు మొర పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లావాసి: కాన్వాయ్ ఆపి..కారు నుంచి దిగిన సీఎం
చెన్నై: ఈ ఫొటోలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు సతీష్. తూర్పు గోదావరి జిల్లావాసి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ను కలవాలనుకున్నాడు. తన అధికారిక నివాసం నుంచి స్టాలిన్ సచివాలయానికి వెళ్లే మార్గంలో- సీఎం సర్ హెల్ప్ మీ అని రాసివున్న ఓ ప్లకార్డును పట్టుకుని నిల్చున్నాడు. సాధారణంగా ఇలాంటివి కనిపించినప్పుడు స్టాలిన్ తన కాన్వాయ్ను అక్కడికక్కడే ఆపేస్తారు. బాధితులతో మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
నీట్ పరీక్ష పై దేశవ్యాప్తంగా గళమెత్తి నినదించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసిన తూర్పుగోదావరి జిల్లా వాసి సతీష్#Neetexam #CMStalin pic.twitter.com/RDKepYGXDl
— oneindiatelugu (@oneindiatelugu) February 3, 2022
సతీష్ విషయంలోనూ అదే జరిగింది. ప్లకార్డును చూసిన వెంటనే స్టాలిన్ తన కారును ఆపేశారు. ఆయనను దగ్గరికి పిలిపించుకున్నారు. తాను కూడా కారు దిగి- సతీష్తో మాట్లాడారు. వివరాలను ఆరా తీశారు. ఆయన చెప్పినదంతా శ్రద్ధగా విన్నారు. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. చెన్నైలోని టీటీకే రోడ్లో చోటు చేసుకుందీ ఘటన. దూసుకెళ్తోన్న స్టాలిన్ కాన్వాయ్ ఒక్కసారిగా ఆగడం, ఏకంగా ముఖ్యమంత్రి కారు నుంచి కిందికి దిగడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలనేది స్టాలిన్ డిమాండ్. దీనిపై ఆయన కొంతకాలంగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. నీట్ నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలంటూ గత సంవత్సరం అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. నీట్ ఒత్తిడితో ఓ విద్యార్థి ఆత్మహత్యకు కూడా పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇదే విషయం మీద గత సంవత్సరం అక్టోబర్లో స్టాలిన్ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ సహా భూపేష్ బఘేల్ (ఛత్తీస్గఢ్), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), ప్రమోద్ సావంత్ (గోవా), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), పినరయి విజయన్ (కేరళ), ఉద్ధవ్ థాకరె (మహారాష్ట్ర), నవీన్ పట్నాయక్ (ఒడిశా), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), మమత బెనర్జీ (పశ్చిమ బెంగాల్)కు లేఖలు రాశారు.
నీట్ వల్ల సంభవించే దుష్పరిణామాలను ఆయన వారికి వివరించారు. ఇదే అంశం మీద జాతీయ స్థాయి ఉద్యమానికి నాయకత్వాన్ని వహించాలని తాజాగా- తూర్పు గోదావరి జిల్లావాసి సతీష్ స్టాలిన్ను విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షలను జాతీయ స్థాయిలో ఏకీకృతం కాకుండా.. రాష్ట్రాలవారీగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్టాలిన్ సానుకూలంగా స్పందించారు. దీనిపై తాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతును కూడగడుతున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications