వివాదాస్పద వేదాంత స్టెరిలైట్.. రీఓపెన్: అప్పట్లో కాల్పులు: గట్టి నిఘా
చెన్నై: అత్యంత వివాదాస్పదమైన వేదాంత స్టెరిలైట్ ప్లాంట్.. పునరుద్ధరణకు నోచుకుంది. నాలుగు నెలల పాటు అందులో కార్యకలాపాలను కొనసాగించడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అధిగమించడంలో భాగంగా ఈ ప్లాంట్ను రీఓపెన్ చేయడానికి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది. ఈ అనుమతులు నాలుగు నెలల పాటు మాత్రమే అమల్లో ఉంటాయి. నాలుగు నెలల తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మళ్లీ మూసివేయడమా? లేక కొనసాగించడమా? అనేది నిర్ణయం తీసుకుంటుంది.
కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల రోజూ పదుల సంఖ్యలో పేషెంట్లు ప్రాణాలను కోల్పోతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఆక్సిజన్ లేకపోవడం వల్ల చేతులెత్తేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, బొకారోలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కర్మాగారాలతో పాటు ప్రైవేటు సెక్టార్కు చెందిన ఇనుము తయారీ ప్లాంట్లల్లో పెద్ద ఎత్తున ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అత్యంత వివాదాస్పద పరిస్థితుల మధ్య ఇదివరకు మూతపడిన వేదాంత స్టెరిలైట్ ప్లాంట్ను కూడా పునరుద్ధరించింది. తూత్తుకుడి సమీపంలో ఉన్న ఈ ప్లాంట్ వల్ల పెద్ద ఎత్తున వాతవారణం, భూగర్భ జలాలు విషతుల్యంగా మారుతున్నాయంటూ స్థానిక మత్స్యకారులు భారీగా ఆందోళనలను చేపట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో కాల్పులకు కూడా దారి తీసింది ఈ ఆందోళన. 2018లో ఈ ప్లాంట్ మూతపడింది. అప్పటి నుంచి ఎలాంటి కార్యకలాపాలు కూడా అందులో చోటు చేసుకోవట్లేదు.

తాజాగా ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి ఈ ప్లాంట్ను పునరుద్ధరించింది తమిళనాడు ప్రభుత్వం. నాలుగు నెలల పాటు మాత్రమే కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. ఆక్సిజన్ను మాత్రమే ఉత్పత్తి చేయాలనే నిబంధనను విధించింది. ఆ ప్లాంట్ కార్యకలాపాలు, ఉత్పత్తి.. ఇతరత్రా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ ప్యానెల్ను సైతం నియమించింది. ఈ ప్యానెల్ ప్రభుత్వానికి రోజువారీ నివేదికలను అందించాల్సి ఉంటుంది. నాలుగు నెలల తరువాత.. అప్పటి పరిస్థితులను బట్టి మూసివేతపై నిర్ణయం తీసుకుంటుంది.












Click it and Unblock the Notifications