హైద్రాబాద్: 'జయ గార్డెన్' ఇక మూత పడాల్సిందేనా..?
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు హైదరాబాద్ నగరంతో సుమారు 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1970లో ఆమె బోయిన్పల్లి నుంచి కొంపల్లి మధ్యలో పేట్ బషీరాబాద్ గ్రామ పరిధిలో సుమారు 15 ఎకరాల స్ధలాన్ని కొనుగోలు చేశారు. అందులో సకల హంగులతో ఓ భవంతిని నిర్మించుకున్నారు. ఈ భవంతి తదనంతర కాలంలో జయ గార్డెన్గా నామకరణం చేసుకుంది. ఐతే ఈ భవంతి ఆమె ప్రియసఖి శశికళ నటరాజన్ పేరుతో ఉంది.

అక్రమాస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్లు శిక్ష పడటంతో హైదరాబాద్ నగరంలో ఉన్న ఆమె ఆస్తుల వ్యవహారం చర్చనీయాంశం అయింది. వీలు చిక్కినప్పుడల్లా నేరుగా హైదరాబాద్ వచ్చేసే జయలలిత ఇక్కడే బస చేసేవారు. అధికారిక పర్యటనలకు వచ్చినా, మరే కారణంతో వచ్చినా హైదరాబాద్ లో ఆమె విడిది జయ గార్డెన్ లోనే. భవనం చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకున్న జయలలిత, అందులో పనివాళ్లుగా తమిళులనే నియమించుకున్నారట.
జయలలిత సినీ రంగంలో ఉన్న కాలంలోనే ఈ భవంతిని కొనుగోలు చేసిన ఈ స్ధలాన్ని అపట్లో ఆమె తరచూ సందర్శించే వారని ఆమె భవంతి పక్కనే వ్యవసాయ క్షేత్రం కలిగిన సామల రాఘవరెడ్డి (జయలక్ష్మీ గార్డెన్స్) అధినేత పేర్కొన్నారు. సుమారుగా పదేళ్ల క్రితం చివరిసారిగా ఆమె ఈ భవంతికి వచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించడంతో ఈ భవంతి ఇక దాదాపుగా మూతపడినట్లేనని స్దానికులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications