టెక్కీ దారుణ హత్య: ఊహా చిత్రం, కిల్లర్పై రూ.50వేల రివార్డ్
న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలో హత్యకు గురైన 27 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజనీర్ అంకిత్ చౌహాన్ను చంపిన వ్యక్తి పొట్టిగా ఉంటాడని, చేతుల పైన టట్టూలతో ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు.
సంఘటన జరిగిన నోయిడాలోని సెక్టార్ 76 ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ నుండి పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుల ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
సీసీటీవీలో ఘటనకు సంబంధించిన ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఇందులో నిందితుల వాహనం ఎక్కడ రిజిస్టర్ అయిందో గుర్తించారు. నిందితుడి ఊహా చిత్రాన్ని ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, హర్యానాలలోని పోలీసు స్టేషన్లకు పంపించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సంఘటన సమయంలో అంకిత్ స్నేహితుడు ఒకరు ఉన్నారు. ఆయనను పోలీసులు విచారించి, ఊహా చిత్రాన్ని గీశారు.
కాగా, 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంకిత్ చౌహాన్ నాలుగు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నోయిడాలోని సెక్టార్ 76లో సోమవారం సాయంత్రం ఈ హత్య జరిగింది. అంకిత్ చౌహాన్ అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు మూడు నెలల క్రితమే వివాహమైంది. భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే.
మిత్రుడితో కలిసి ఇంటికి వెళ్తుండగా ఆ సంఘటన జరిగింది. వైట్ హోండా అకార్డ్లో ఇద్దరు వ్యక్తులు టెక్కీ ప్రయాణిస్తున్న టయోటా ఫార్చూనర్ను దాటేసి కాల్పులు జరిపారు. కాల్పుల్లో టెక్కీ చేతికి, మెడకు దెబ్బలు తగిలాయి. గాయపడిన అతన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే, అప్పటికే అతను మరణించాడు.
అంకిత్ చౌహన్పైకి నాలుగు సార్లు కాల్పులు జరిపారని, ఆ సమయంలో అతను కారు నడుపుతున్నాడని, ఆఫీసులో తన భార్యను కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.
అంకిత్ కారును తమ కారుతో ఆగంతులు దాటేసి, కాస్తా పక్కకు తీసుకుని కాల్పులు జరిపారు. ఈ స్థితిలో అంకిత్ నియంత్రణ కోల్పోవడంతో అతని కారు చెట్టుకు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగంతకుల్లో ఒకతను కిందికి దిగి అంకిత్ మెడపై కాల్పులు జరిపాడు. అంకిత్ మిత్రుడు గగన్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, కారును నడపడం అతనికి రాదు. ఆ స్థితిలో ఒకతను వారిని కైలాస్ ఆస్పత్రికి చేర్చాడు.