ఢిల్లీలో టీనేజీ అమ్మాయి దారుణ హత్య... శరీరాన్ని ముక్కలుగా కోసిన ప్రేమికుడు
ఢిల్లీ: ఢిల్లీ నిజాముద్దీన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ టీనేజీ అమ్మాయిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి రెండు సంచుల్లో నింపి డ్రైనేజీలో పడేశాడు ఓ దుర్మార్గుడు. అంతేకాదు తానేదో ఘనకార్యం చేసినట్లుగా పోలీసులకు వెళ్లి తాను చేసిన బాగోతాన్ని చెప్పి సరెండర్ అయ్యాడు. హంతకుడిని 20 ఏళ్ల రిజ్వాన్ ఖాన్గా గుర్తించారు. హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో నిజాం నగర్లో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్కు వెళ్లి తాను ప్రేమించిన అమ్మాయిని చంపినట్లుగా నిందితుడు రిజ్వాన్ ఖాన్ పోలీసులకు తెలిపి లొంగిపోయాడు. తాను ప్రేమించిన అమ్మాయిని కత్తితో చంపి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి రెండు సంచుల్లో నింపి బారుపుల్లా ఫ్లైఓవర్ కింద ప్రవహించే నాలాలో పడేసినట్లు పోలీసులకు తెలిపాడని ప్రత్యేక పోలీస్ కమిషనర్ ఉపాధ్యాయ చెప్పారు. నిందితుడు పోలీసులను నాలా దగ్గరకు తీసుకెళ్లి చూపించాడు. అక్కడే పోలీసులకు రెండు సంచులు దొరికాయి .ఒక సంచిలో అమ్మాయి తల ఉండగా మరో సంచిలో మిగతా అవయవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించారు పోలీసులు. అక్కడకు చేరుకున్న ఫోరెన్సిక్ సిబ్బంది అమ్మాయి అవయవాలను మెడికల్ టెస్టుల కోసం తీసుకెళ్లారు.
తను అమ్మాయిని 11 నెలలుగా ప్రేమిస్తున్నట్లు రిజ్వాన్ ఖాన్ చెప్పాడు. అయితే మరో వ్యక్తితో ప్రేమలో పడిందన్ననిజాన్ని జీర్ణించుకోలేక పోయినట్లు ఖాన్ తెలిపాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఆదివారం సాయంత్రం గొడవ జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో ఆగ్రహానికి గురై అమ్మాయి గొంతును కత్తితో కోసినట్లు పోలీసులకు వివరించాడు.అమ్మాయి శరీరాన్ని రెండు ముక్కలుగా చేసి రెండు బ్యాగుల్లో నింపి సోమవారం తెల్లవారుజామున నాలాలో పడేసినట్లు వివరించాడు.