29వ రాష్ట్రంగా తెలంగాణ: సంబరాలు, ఫస్ట్ ఓటు నామా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ ఆమోదం తెలపడంతో దేశంలో 29వ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడనుంది. ఆంధ్రప్రదేశ్పై 60 ఏళ్ల పాటు ప్రయోగాలు జరిపిన కేంద్రం విఫలమైందని, దీనిని గుర్తించిన కేంద్రం ఇప్పుడు ప్రకటించిందని తెలంగాణవాదులు సంబరాలు చేసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి కార్యాలయం, తెలంగాణ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణవాదులు బాణసంచా పేల్చి, మిఠాయి పంచుకొని ఆనందాలు పంచుకుంటున్నారు.

కాగా, తెలంగాణ బిల్లుకు లోకసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపిన అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. బిల్లులోని సవరణల పైన రెండు గంటల పాటు చర్చ జరిగింది. లోకసభ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి చర్చను చేపట్టారు.
క్లాజుల వారీగా: నామా
ఉత్కంఠ పరిస్థితుల మధ్య తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు నామా నాకేశ్వర రావు, రమేష్ రాథోడ్, ఎమ్మెల్యే సీతక్కలు అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి కలిసి ఉండాలనేది తమ ఆకాంక్ష అన్నారు. అందరి పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. బిల్లు ఆమోదానికి రెండు గంటల సమయం పట్టిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుదామన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలన్నారు. తెలంగాణ బిల్లుకు తానే మొదటి ఓటు వేసినట్లు నామా చెప్పారు.
కాంగ్రెస్ నిరంకుశంగా: చంద్రబాబు
రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ మొదటినుంచి నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ఆర్టికల్ 3ను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని బాబు ఆరోపించారు.












Click it and Unblock the Notifications