వరవరరావు ఆరోగ్యం మరింత విషమం: బోంబే హైకోర్టులో పిటీషన్: కుటుంబ సభ్యుల మధ్య తుదిశ్వాస విడిచేలా
ముంబై: తెలంగాణకు చెందిన ప్రముఖ విప్లవ కవి వరవర రావు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందనే వార్తలు వెలువడుతున్నాయి. 81 సంవత్సరాల వరవర రావు ఆరోగ్యపై కుటుంబ సభ్యులు, పౌర హక్కు సంఘాల ప్రతినిధులు ఆందోళనలు వ్యక్తం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. వరవర రావు ఆరోగ్యం దిగజారుతోందని, ఆయన మృత్యుముఖంలోకి వెళ్తున్నారంటూ పిటీషన్లో పేర్కొన్నారు.

ఇద్దరు సభ్యుల ధర్మాసనం ముందుకు పిటీషన్..
ఆయనకు వెంటనే బెయిల్ను మంజూరు చేయాలంటూ విజ్ఙప్తి చేశారు. ప్రముఖ న్యాయవాది సుదీప్ పస్బోలా ఈ పిటీషన్ను దాఖలు చేశారు. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బోంబే హైకోర్టు ధర్మాసనం ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎస్పీ తవాడేలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ చేపట్టింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తరఫున వాదించిన మహారాష్ట్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలను ఆలకించింది.

భీమా-కోరేగావ్ సహా..
ఎల్గార్ పరిషత్, భీమా-కోరేగావ్ కేసుల్లో వరవర రావును ప్రధాన నిందితుడిగా గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ 2018 నవంబర్లో ఆయనను అరెస్టు చేసింది. ముంబైకి తరలించింది. ఈ కేసులతో పాటు మావోయిస్టులతో చేతులు కలిపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలను కూడా వరవర రావు ఎదుర్కొంటున్నారు. తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. కొద్దిరోజుల కిందట ఆయన అనారోగ్యానికి గురి కావడం, కరోనా వైరస్ బారిన పడటం వల్ల జేజే ఆసుపత్రికి తరలించారు.

నానావతిలోనూ మెరుగు పడని ఆరోగ్యం..
అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో తొలుత సెయింట్ జార్జ్ ఆసుపత్రికి, అనంతరం నానావతి ఆసుపత్రికి వరవర రావును తరలించారు. ప్రస్తుతం ఆయన నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని, పైగా క్షీణిస్తోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో న్యాయవాది సుదీప్ పస్బోలా బోంబే హైకోర్టును ఆశ్రయించారు. వరవరరావుకు బెయిల్ను మంజూరు చేయాలని విజ్ఙప్తి చేశారు.

కుటుంబ సభ్యుల మధ్యే..
విచారణ సందర్భంగా సుదీప్ పస్బోలా కీలక వ్యాఖ్యలను చేశారు. వరవర రావు ప్రస్తుతం మృత్యుముఖంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తుదిశ్వాస విడవడమంటూ జరిగితే.. అది ఆసుపత్రిలో కాదని, కుటుంబ సభ్యుల మధ్య కావాలని అన్నారు. వరవర రావు విషయంలో మానవతా దృక్పథంతో నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 81 సంవత్సరాల వయస్సున్న వరవర రావుకు బెయిల్పై విడుదల చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయనను చూడటానికి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరారు.

ముంబై బెస్ట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్..
ఈ సందర్భంగా ఎన్ఐఏ తరఫు న్యాయవాది అనిల్ సింగ్ తన వాదనలను వినిపించారు. ముంబైలోని టాప్ ఆసుపత్రుల్లో ఒకటైన నానావతిలో వరవర రావుకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఆయనకు అత్యుత్తమ వైద్య చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. వరవర రావు ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అనంతరం ధర్మాసనం.. ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications