ఉగాది విషెస్, ప్రజలకు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు
తెలుగు సంవత్సరాది.. ఉగాది పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవ కృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతోందని సీఎం అన్నారు. శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించి.. దేశాభివృద్ధికి దిక్సూచీగా మారాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రజలకు ఉగాధి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందని, రైతన్నలు వ్యవసాయ పనులు ఉగాది నుంచి ప్రారంభిస్తారని అన్నారు. అన్నదాతల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సర్కారు కృషితో వ్యవసాయరంగంలో తెలంగాణ అతి తక్కువ కాలంలో దేశం గర్వించే స్థాయికి ఎదిగిందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైందని చెప్పారు. కరోనా కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జీడీపీకి దోహదపడుతోందని అన్నారు.

ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని.. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు కురవాలని.. పంటలు బాగా పండి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు. సకల వృత్తుల వారూ ఆనందంగా ఉండాలని.. పల్లె పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని ప్రార్థించారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు కలకాలం వర్థిల్లాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ.. ఉగాది పండగను.. సంప్రదాయరీతిలో చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్.. పిలుపునిచ్చారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శుభ అంటే మంగళకరం అని.. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలకు అంతా శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఉగాది పండగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో చేసుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. శుభకృత్ నామ సంవత్సరం.. ప్రజలకు సర్వ శుభాలను కలగజేయాలని కోరుకున్నారు.












Click it and Unblock the Notifications