మరో ఏడాది: బడ్జెట్పై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు, మన్మోహన్ ఇలా
న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికలకు ఏడాది ఉన్నా.. మోడీ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలేదని అన్నారు.
అంతేగాక, యువతకు ఉపాధి అవకాశాలను కూడా కల్పించలేదని అన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బడ్జెట్ పై పెదవి విరిచారు. తాను బడ్జెట్ను విమర్శించదల్చుకోలేదని అన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఎలా చేస్తుందో చెప్పలేదని అన్నారు. బడ్జెట్లో అన్ని అంశాలను అమలు చేస్తే బాగుంటుందని అన్నారు. ఆరోగ్య బీమా పథకాన్ని స్వాగతిస్తున్నట్లు మరో ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు.
కాగా, మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ బడ్జెట్ విషయమై ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. 'ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం బడ్జెట్ విషయంలో తన డయాగ్నసిస్ను వినిపించారు. మరి రోగి (ఆర్థిక శాఖ, మోదీ ప్రభుత్వం) దీని గురించి సరైన చర్యలు తీసుకుంటుందో, లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తుందో వేచి చూడాలి' అంటూ అంటూ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.