కోర్టులో మాజీ మంత్రిపై నిందితుడి సంచలన వ్యాఖ్యలు, వందల కోట్ల స్కామ్ కేసు, చంపేస్తారు ?
కర్ణాటకలోని మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్లో రూ.187 కోట్ల అక్రమాలు జరిగాయని నమోదు అయిన కేసు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర తలవంపులు తెచ్చింది. ఈ కుంభకోణం నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టగా కర్ణాటక మాజీ మంత్రి బి. నాగేంద్ర సన్నిహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని జడ్జి ఎదుట నిందితుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్లో రూ. 187 కోట్లు అవినీతి జరిగిందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం చేసిన తరువాత బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బి.నాగేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల వరకు సిద్దరామయ్య ప్రభుత్వంలో నాగేంద్ర మంత్రిగా పని చేశారు. అయితే కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్లో రూ. 187 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఇటీవలే నాగేంద్ర ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇప్పుడు ఇదే కేసులో అరెస్టు అయిన నిందితుడు కోర్టులో న్యాయమూర్తి ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నాగేంద్ర సన్నిహితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇదే కుంభకోణంలో అరెస్టు చేసిన నిందితుడు సత్యనారాయణ వర్మ కోర్టులో న్యాయమూర్తి ముందు బోరున విలపించాడు. బుధవారం కోర్టులో న్యాయమూర్తి ఎదుట నిందితుడు సత్యనారాయణ వర్మ మాజీ మంత్రి నాగేంద్ర అనుచరుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం కేసులో సత్యనారాయణవర్మ 13వ నిందితుడు.వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం నిందితుడు అయిన సత్యనారాయణ వర్మతో పాటు మరో ముగ్గురు నిందితులను బుధవారం బెంగళూరులోని 3వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో తనకు ప్రాణహాని ఉందని సత్యనారాయణ వర్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. అరెస్టుకు ముందు మాజీ మంత్రి నాగేంద్ర అనుచరులు బి.సత్యనారాయణ వర్మ ఇంటికి వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి.
మాజీ మంత్రి నాగేంద్ర సహచరులు మా ఇంటికి వచ్చి తనతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ బెదిరించారని సత్యనారాయణ వర్మ కోర్టులో న్యాయమూర్తి ముందు వాపోయాడు. కస్టడీలో ఉండగానే తనపై మాజీ మంత్రి నాగేంద్ర సన్నిహితులు దాడికి యత్నించారని, మాజీ మంత్రి నాగేంద్ర పీఏ నెక్కుంది నాగరాజ్ అనుచరులు తన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
కోర్టు నుంచి బయటకు తీసుకెళ్తుండగా తన మీద దాడికి యత్నించారని నిందితుడు సత్యనారాయణ వర్మ ఆరోపించాడు. నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయమూర్తి దాడిపై విచారణ చేపట్టాలని బెంగళూరులోని హలాసురు గేట్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ దెబ్బతో కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications