ఎంపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంపై స్పందించిన బాలీవుడ్ క్వీన్..
దేశంలో ఎన్నికల హంగామా షూరూ అయ్యింది. దేశంలోని పెద్ద పార్టీలన్నీ తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో నిన్న బిజెపి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో బాలీవుడ్ క్వీన్ పేరు కూడా ఉంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. కంగనా సొంత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ సీటును కేటాయిస్తూ బీజేపీ ఆదివారం రాత్రి ఆమె పేరును ప్రకటించడం జరిగింది. ఇక, ఈ విషయంపై కంగనా తొలిసారిగా స్పందించారు.
ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. అందులో ఇలా రాసుకొచ్చారు. '' నా ప్రియమైన భారతదేశం, ఈ దేశ ప్రజల సొంత పార్టీ అయిన బీజేపీకి ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. నా సొంత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం నా పేరుని ప్రకటించింది. బీజేపీ పార్టీలో చేరడం నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. లోక్సభ ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను. ఈ ప్రకటనతో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నిజమైన బీజేపీ కార్యకర్తగా, విశ్వసనీయత కలిగిన ప్రజా సేవకురాలిగా పనిచేస్తాను. అందరికీ నా ధన్యవాదాలు''అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చారు.

విభిన్నమైన పాత్రల్లో నటించిన కంగనా..
బాలీవుడ్లో విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ విలక్షణమైన నటిగా మంచి గుర్తించుకున్నారు నటి కంగనా. ఈమె లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కూడా చాలా చేశారు. క్వీన్, ఫ్యాషన్ వంటి చిత్రాలతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. గ్యాంగ్స్టర్, వో లమ్హే, 'లైఫ్ ఇన్ ఎ...మెట్రో', ఫ్యాషన్, రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్, తను వెడ్స్ మను, క్వీన్, రివాల్వర్ రాణీ, మణికర్ణిక వంటి ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'ఎమర్జెన్సీ' చిత్రం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications