ప్రధాని మోదీ- అమిత్ షా కు అసలు పరీక్ష నేటి నుంచి మొదలు..!!
కేంద్రంలో అధికారం దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న ప్రధాని మోదీకి అసలు పరీక్ష ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ లో నేడు ఎన్నికల నగారా మోగనుంది. నేడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ మధ్నాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే గుజరాత్ కు కూడా షెడ్యూల్ విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ, కేవలం హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ మాత్రమే విడుదల అయింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించే విధంగా నోటిఫికేషన్ జారీ అయింది. గుజరాత్ లో 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్న గుజరాత్ అసెంబ్లీ కాల పరిమితి 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 99, కాంగ్రెస్ 77 స్థానాల బలంతో ఉన్నాయి. కొద్ది నెలలుగా ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా గుజరాత్ ఎన్నికల్లో భాగంగా ముందస్తు ప్రచారం ప్రారంభించారు.
అనేక అభివృద్ధి పనులను ప్రారంభించటంతో పాటుగా మరి కొన్నింటికి శంకుస్థాపనలు చేసారు. 2024 ఎన్నికల ముందు జరిగే సెమీస్ కావటం..అందునా సొంత రాష్ట్రం కావటంతో గుజరాత్ ఎన్నికలు ఈ ఇద్దరు అగ్ర నేతలకు కీలకంగా మారనుంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఖర్గే ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు ఇవే. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఒకే విడతలో నవంబర్ 12న జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడి కానున్నాయి. అయితే, ఈలోగానే గుజరాత్ ఎన్నికలు కూడా పూర్తవుతాయని తొలుత అంచనాలు వ్యక్తం అయ్యాయి.
రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో, వచ్చే నెలలోనే ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాగైనా గెలిచి, వచ్చే ఏడాది జరిగే దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక..తెలంగాణ పైన ఫోకస్ పెట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ లో ఈ సారి కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. దీంతో, ఇప్పుడు ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వటంతోనే రాజకీయం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.