‘దేవుడి ఆరోగ్యం బాగోలేదు.. 15రోజుల తర్వాతే ఆశీస్సులు!’
ఉదయ్పూర్: మనషులకు, ఇతర జీవులకు అనారోగ్యం చోటు చేసుకోవడం సర్వ సాధారణమే. కానీ, దేవుడికి కూడా ఆరోగ్యం బాగోలేదంటూ ఎవరైనా నమ్ముతారా? అవును. నమ్మాలి. ఎందుకంటే ఏకంగా ఓ ఆలయ పూజారే భక్తులకు ఈ మేరకు చెబుతున్నారు.
'దేవుడికి ఆరోగ్యం బాగోలేదు. అందువల్ల ఆయన భక్తులను చూడలేరు. ఆయన ప్రస్తుతం ఔషధ సేవలో ఉన్నారు.. 15 రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాతనే భక్తులను దీవెంచేందుకు వస్తారు' అని ఆలయ ప్రధాన పూజారి చెబుతున్నారు. ఇదంతా ఎక్కడో తెలుసా?.. ఉదయ్పూర్లోని జగన్నాథ్ ధామ్ ఆలయంలో. ఇక్కడి దేవాలయం కూడా ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలానే నిర్మించబడింది. పూజా కార్యక్రమాలు కూడా రెండు దేవాలయాల్లో ఒకేలా జరుపుతారు.

అయితే, ఇక్కడ ప్రత్యేకత ఏమీటంటే దేవుడికి ఆరోగ్యం బాగోదు. అందుకే ఆయన 15రోజులపాటు విశ్రాంతి తీసుకుంటారు. దేశంలో ఎక్కడా ఇలా లేదు గానీ, ఒక్క ఈ ఆలయంలోనే ప్రతియేటా ఇలా చేస్తుంటారట.
జగన్నాథ్ ధామ్లో జగన్నాథ భగవానుడు మానవరూపంలో ఉంటాడు. అందువల్ల మనుష్య ధర్మాన్ని భగవంతుడు పాటిస్తాడని అంటారు. ఆ ఆచారం ప్రకారం 'జ్యేష్ఠ పూర్ణిమ' తర్వాత.. ఈ జగన్నాథుడికి 35 స్వర్ణఘటాలతో స్నానం చేయిస్తారు. తర్వాత ఆయనను ప్రత్యేక స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టి, మామిడిపళ్ల రసం ఇస్తారు.
ఎక్కువ సేపు స్నానం చేయడం, తర్వాత మామిడిరసం తాగడంతో భగవంతుడికి అనారోగ్యంగా ఉందని, అందువల్ల 15 రోజుల పాటు భోగాలు ఏమీ చేయకుండా కేవలం మూలికా ఔషధాలు మాత్రమే ఇస్తామని జగన్నాథ ధామ్ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ భట్టి తెలిపారు.
ఆ తర్వాత ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. అప్పుడు సుభద్ర, బలభద్రులతో కలిసి జగన్నాథుడు రథోత్సవంలో పాల్గొంటారు. భక్తుల తరఫున భగవంతుడికి ఒక విజ్ఞాపన పంపామని, ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఆయన ఆశీస్సులు భక్తులు తీసుకుంటారని భట్టి తెలిపారు. దేవాలయం తిరిగి తెరిచిన తర్వాత భగవంతుడికి 21 రకాల పదార్థాలతో నివేదన చేసి, నగరంలో రథయాత్ర చేస్తామని, ఆయన ప్రజలందర్నీ ఆశీర్వదిస్తారని తెలిపారు.
కాగా, ఇదే సమయంలో జగదీష్ చౌక్లోని జగదీష్ ఆలయంలో కూడా స్వామివారికి ఇలా సేవలే జరుగుతాయి. ఆయన కూడా అనారోగ్యంతో కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటారు. కానీ, ఎలాంటి ఔషధాలు తీసుకోరు. జులై 5 నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున రథయాత్ర సాగుతుంది.












Click it and Unblock the Notifications