ఒక్కసారిగా పడిపోయిన చికెన్ ధర.. కారణమిదే - ప్రెస్ రివ్యూ

చికెన్

ఏపీలో చికెన్‌ ధర ఒక్కసారిగా పడిపోయిందని ఆంధ్రజ్యోతి కథనం రాసింది. దాని ప్రకారం..

ఏపీలో కిలో చికెన్ రూ.70-80దాకా తగ్గింది.

గత వారం బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.220 అమ్మగా, ప్రస్తుతం రూ.140-150కే విక్రయిస్తున్నారు.

గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్‌ ధర ఇప్పుడు రూ.80 మాత్రమే పలుకుతోంది.

వేసవి కారణంగా 30% దాకా వినియోగం తగ్గడంతో చికెన్‌ ధరలు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.

అయితే, నిరుడు ఇదే సమయంలో కిలో చికెన్‌ రూ.250పైగా పలికింది.

అప్పుడు కరోనా బారిన పడకుండా, ఇమ్యూనిటీ కోసం లాక్‌డౌన్‌ సడలింపు సమయాల్లో చికెన్‌, మటన్‌కు డిమాండ్‌ పెరిగింది.

ఇప్పుడు.. ఆదివారాలు తప్ప, మిగిలిన రోజుల్లో చికెన్‌ దుకాణాలు వెలవెలబోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. హోల్‌సేల్‌గా 100గుడ్లకు రూ.50-65దాకా తగ్గింది. రిటైల్‌గా గుడ్డు రూ.5 చొప్పున అమ్ముతున్నారు.

ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకా ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.

ఇందుకు సుమారు రూ.1600 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటికే 45, ఆపై వయసున్న వారందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే టీకాలు వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి 18-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి సైతం వ్యాక్సినేషన్‌ చేయాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ గ్రూపు వయస్కులు 2,04,70,364 మంది ఉన్నారని, వారందరికీ అవసరమైన టీకాల కోసం కంపెనీలకు ఆర్డర్‌ పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారని ఈనాడు రాసింది.

సమీక్ష సమావేశంలో సీఎం ప్రకటించిన నిర్ణయాలను, సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) విలేకరుల సమావేశంలో వెల్లడించారని ఈనాడు రాసింది.

దావానలంలా వ్యాపిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు.

రోజూ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.

విరసంపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం

విప్లవర రచయితల సంఘంపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

వివిధ సమస్యలపై పోరాడే రాష్ట్రంలోని 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వం తొలిసారి నిషేధం విధించింది.

వీటిలో విరసం, పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌, గోండు గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న తుడుం దెబ్బ వంటి ప్రజా సంఘాలున్నాయని పత్రిక రాసింది.

ఇవి నిషేధిత భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)కు అనుబంధంగా పనిచేస్తూ, చట్ట వ్యతిరేక, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, కార్యకర్తలను ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు ఉసిగొల్పుతున్నాయని ప్రభుత్వం ఆరోపించింది.

అందుకే వీటిని 'చట్టవిరుద్ధ సంఘాలు(అన్‌లాఫుల్‌ అసోసియేషన్స్‌)'గా గుర్తించి, నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది.

దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల(జీవో నెంబర్‌ 73)ను జారీ చేశారు.

మార్చి 30 నుంచి ఏడాదిపాటు ఈ నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, రాష్ట్రంలోని 33 జిల్లాలకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

విద్యార్థులు

ఏపీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ నైపుణ్య శిక్షణ

ఏపీ ఉన్నత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రతిష్టాత్మక ఐటీ దిగ్గజ సంస్థ.. మైక్రోసాఫ్ట్‌ రాష్ట్రంలో 1,62,000 మంది ఉన్నత విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇంత భారీ స్థాయిలో మైక్రోసాఫ్ట్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

శుక్రవారం వర్చువల్‌ విధానంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మైక్రోసాఫ్ట్‌ ఆసియా పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ మజ్‌హరి తదితరులు పాల్గొన్నారు.

ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో విద్యార్థులకు కోర్సు పూర్తి చేసిన వెంటనే చక్కటి ఉపాధి పొందే అవకాశం లభిస్తుందన్నారు.

శిక్షణ పూర్తి చేసుకున్నవారికి మైక్రోసాఫ్ట్‌ ఇచ్చే సర్టిఫికెట్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా సంబంధిత కోర్సుకు సంబంధించిన రంగాల్లో వెంటనే ఉద్యోగం పొందే వీలు కలుగుతుందని పత్రిక రాసింది.

ఈ ఒప్పందం ద్వారా మైక్రోసాఫ్ట్‌ రాష్ట్రంలో 300కుపైగా కాలేజీల్లోని విద్యార్థులు, నైపుణ్య శిక్షణ కేంద్రాల్లోని 1,62,000 మందికి 42 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుంది.

మైక్రోసాఫ్ట్‌ లెర్నింగ్‌ కింద ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉన్న క్లౌడ్‌ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), మైక్రోసాఫ్ట్‌ డైనమిక్స్‌ 365 వంటి 42 రకాల సాంకేతిక నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది.

ఇందులో కొన్ని కోర్సుల సమయం 40 గంటలు, కొన్ని కోర్సుల నిడివి 160 గంటల వరకు ఉంటుందని సాక్షి వివరించింది.

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పుట్టినరోజు నాడే ప్రభుత్వ ఉద్యోగి మృతి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక యువతి కోవిడ్ మహమ్మారి వల్ల పుట్టినరోజు నాడే చనిపోయిందని నమస్తే తెలంగాణ వార్తా కథనం ప్రచురించింది.

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవిత పోరాటంలో గెలిచిన ఓ యువతి.. కొవిడ్‌ మహమ్మారితో పోరాటంలో ఓడింది.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలోని పద్మాజివాడికి చెందిన జాజావ్‌ గంగాధర్‌రావు మూడో కుమార్తె జాజావ్‌ విజయ (26) తాడ్వాయి తాసిల్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఆమె మూడు ఉద్యోగాలు సాధించి సత్తాచాటింది. మొదట అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌గా, పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాలు రాగా.. పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరారు.

మల్లుపేట్‌లో ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌-4 పరీక్ష రాసి రెవెన్యూశాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఎంపికైంది. ఉద్యోగం రావడంతో మొక్కు చెల్లించుకునేందుకు వారం క్రితమే కుటుంబసభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లివచ్చారు.

జ్వరం రావడంతో బుధవారం సదాశివనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించగా విజయతోపాటు తల్లి, అక్కకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

గురువారం విజయకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు రావడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా.. చికిత్సపొందుతూ మృతిచెందింది అని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+