స్వయంకృషితో పైపైకి.. మూఢ నమ్మకాలతో పతనానికి.. పర స్త్రీ వ్యామోహంతో దోశ కింగ్ చాప్టర్ క్లోజ్
చెన్నై : స్వయంకృషితో పైకి వచ్చాడు. దోశ కింగ్గా పేరు గాంచాడు. చివరకు మూఢ నమ్మకాలను నమ్మి జీవితం పాడు చేసుకున్నాడు. రాజగోపాల్ నామరూపాన్ని సార్థకం చేసుకుంటూ రాజభోగాలు అనుభవించాడు. ఆ క్రమంలో తప్పటడుగులు వేసి జైలు శిక్షకు సిద్ధమవుతున్నాడు. శరవణ భవన్ వ్యవస్థాపకుడిగా ప్రపంచస్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న రాజగోపాల్ ప్రస్థానం శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరనుంది.

దోశ కింగ్ ఎదిగాడు ఇలా.. ప్రపంచవ్యాప్తంగా 20 రెస్టారెంట్లు
దాదాపు 70 ఏళ్ల వయస్సున్న రాజగోపాల్ ఎప్పుడూ ప్రశాంతంగా, ఉల్లాసంగా కనిపించేవారు. నుదుటిపై గంధం బొట్టుతో చూడగానే ఆకట్టుకునే ఆహార్యం ఆయన సొంతం. రాజగోపాల్ తక్కువ కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయనలోని లక్షణాలు ఎప్పుడూ కూడా కుల ప్రస్తావన లేకుండా చేసింది. చాలామంది ఆయన ఉన్నత కులానికి చెందినవాడిగానే భావించేవారు.
ఉల్లిపాయల వ్యాపారం చేసుకునే కుటుంబం నుంచి వచ్చిన రాజగోపాల్.. 1981లో చెన్నైలో చిన్న కిరాణ కొట్టు ప్రారంభించారు. అదే ఆయన జీవన గమనానికి తొలి మెట్టు. అలా మొదలైన వ్యాపార ప్రస్థానం అతడిని ప్రపంచానికి పరిచయం చేసింది. శరవణ భవన్ పేరుతో తక్కువ ధరకే ఇడ్లీ, దోశలు అందించే హోటల్ ప్రారంభించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు దేశ, విదేశాల్లో కలిపి ఆయనకు దాదాపు 20 వరకు హోటళ్లు ఉండటం విశేషం.

రాజగోపాల్ రాజభోగాలు.. తప్పటగులు వేసి..!
రాజగోపాల్ పేరున్న ఆ పెద్దమనిషి తక్కువ స్థాయి నుంచి వచ్చి రాజభోగాలు అనుభవించారు. కానీ జీవితంలో వేసిన ఓ తప్పటడుగు ఆయన్ని జైలు పాలు చేసింది. పేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మహా సామ్రాజ్యం నిర్మించుకున్న రాజగోపాల్ పర స్త్రీ వ్యామోహంలో జీవితం నాశనం చేసుకున్నారు.
మూఢనమ్మకాల కారణంగా ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి చివరకు జైలు పాలయ్యారు. తన దగ్గర పనిచేసే ఉద్యోగులను బాగా చూసుకుంటారనే పేరున్న రాజగోపాల్.. కింది స్థాయి ఉద్యోగి కూతురును పెళ్లి చేసుకోవాలనే క్రమంలో హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

మూడో పెళ్లి చేసుకునే క్రమంలో..!
జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని రాజగోపాల్ దారి తప్పారనే వాదనలున్నాయి. 2000 సంవత్సరంలో తన హోటల్లో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి కూతురును పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. అప్పటికే అతడికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. అయితే జ్యోతిష్యుడు ఆ అమ్మాయిని చేసుకుంటే కలిసొస్తుందని చెప్పాడో, ఏమో గానీ ఆమె వెంట పడ్డారు రాజగోపాల్. అయితే అప్పటికే వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆ అమ్మాయి నో చెప్పింది.

దోశ కింగ్ దోషిలా మారాడు.. జులై 7 నుంచి యావజ్జీవ కారాగార శిక్ష
ఆ క్రమంలో తన మాట వినలేదనే అక్కసుతోనో, ఆమె భర్తను చంపితే తన దగ్గరకు వస్తుందనే కారణంతోనే.. మొత్తానికి 2001లో అతడిని హత్య చేయించారు. ఆ కేసులో కోర్టు 2004 సంవత్సరంలో రాజగోపాల్ను దోషిగా నిర్ధారించింది కోర్టు. అంతేకాదు 10 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. తిరిగి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నప్పటికీ ఆయనకు కాలం కలిసిరాలేదు. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాలతో జులై 7వ తేదీ అంటే వచ్చే ఆదివారం నుంచి ఆయనకు శిక్ష అమలు కానుంది. సాధారణ స్థాయి నుంచి వచ్చి అసాధారణ స్థాయికి ఎదిగిన రాజగోపాల్ ప్రస్థానం ఇకపై జైలు గోడలకు పరిమితం కానుంది.












Click it and Unblock the Notifications