కరోనా మళ్లీ విజృంభణ - తెలంగాణతో సహా : అప్రమత్తంగా ఉండాలి - కేంద్రం లేఖ..!!
దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల్లో ఒక్క సారిగా పెరుగుదల కనిపిస్తోంది. కొద్ది రోజులుగా క్రమేణా కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో, కేంద్రం అప్రమత్తమైంది. ఒక్క రోజులోనే కేసుల సంఖ్య 21వేలు దాటింది. తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల్లో కరోనా పైన అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం లేఖలు రాసింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కొవిడ్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. దీంతో కొవిడ్ కట్టడికి ముమ్మర చర్యలు తీసుకోవాలని కోరింది.
24 గంటల్లో 4041 పాజిటివ్ కేసులు
గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 4041 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దాదాపు మూడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా పాజిటివిటీ రేటు కూడా ఒక శాతానికి చేరువయ్యింది. కేవలం మహారాష్ట్ర, కేరళలోనే వెయ్యి చొప్పున కేసులు వెలుగు చూశాయి. ముంబయిలో కొవిడ్ పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు.
లేదంటే మళ్లీ ఆంక్షలు విధించాల్సి రావచ్చని పరోక్ష హెచ్చరిక చేశారు. మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గురువారం 1,045 కేసులు నమోదు కాగా.. శుక్రవారం కేసుల సంఖ్య 1,134కు చేరుకుంది. కరోనా బారిన పడి ముగ్గురు మరణించారు.
84 రోజుల తరువాత భారీ సంఖ్యలో
ఫిబ్రవరి 24 తర్వాత ఈరోజే అత్యధిక కేసుల నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం 345 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కేసుల సంఖ్య 19,07,982కు పెరిగింది. మరణాల సంఖ్య 26,212గా ఉంది. పాజిటీవిటి రేటు 1.88 శాతంగా ఉంది. ఈ క్రమంలో టెస్టుల సంఖ్య పెంచడం, జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టడాన్ని ముమ్మరంగా చేయాలని సూచించింది.
వైరస్ వ్యాప్తి తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమర్థంగా కట్టడి చర్యలు చేపట్టాలని కేంద్రం రాసిన లేఖలో అయిదు రాష్ట్రాలను కోరింది. దాదాపు 84 రోజుల తర్వాత.. కేసులు 4 వేల మార్కును దాటాయి. డైలీ పాజిటివిటీ రేటు 0.95 శాతానికి పెరిగింది.
అప్రమత్తంగా ఉండలంటూ లేఖ
వీక్లీ పాజిటివిటీ రేటు 0.73గా ఉంది. ఒక్కరోజే 10 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. పాజిటివ్ కేసులు ఎక్కువగా ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లోనే నమోదవుతున్నట్లు తెలిపింది. ఇక రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం తెలంగాణలో టెస్ట్ పాజిటివిటీ రేటు 0.4 నుంచి 0.5 శాతానికి పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖలో పేర్కొన్నారు.
వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 21,055 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 375 నమోదయ్యాయన్నారు. శుక్రవారం తెలంగాణలో కొత్తగా 49 కొవిడ్ పాజిటివ్లు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు 520 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.