ఢిల్లీ అల్లర్లు : కుట్ర కోణం ఉందన్న కిషన్ రెడ్డి.. మూడుకి పెరిగిన మృతుల సంఖ్య
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భజన్ పూర్, మౌజ్ పూర్, జాఫ్రాబాద్,కబీర్ నగర్ ప్రాంతాల్లో సీఏఏ ఆందోళనకారులకు,మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణ హింసకు దారితీసింది. ఇందులో మృతుల సంఖ్య మూడుకి పెరిగింది. వీరిలో ఇద్దరు సాధారణ పౌరులు కాగా.. ఒకరు హెడ్ కానిస్టేబుల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న రోజే ఢిల్లీలో హింస చోటు చేసుకోవడం భారత ప్రతిష్టకు భంగం కలిగించేదిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనలపై విచారం వ్యక్తం చేశారు.

కుట్ర కోణం ఉందన్న కిషన్ రెడ్డి
ఢిల్లీలో జరిగిన రాళ్ల దాడిని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నవారు పోలీసులపై రాళ్లు విసిరి శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న సందర్భంలో ఇలాంటి దాడులు జరగడం.. భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకేనని అన్నారు. ఈ దాడుల్లో కుట్ర కోణం ఉందన్నారు.

కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రెండు నెలలుగా షాహీన్బాగ్లో జాతీయ రహదారిని దిగ్భందించి ధర్నా చేస్తున్నా.. తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కిషన్ రెడ్డి. కానీ తాజా దాడులపై తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. శాంతియుత ఆందోళనలు చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని.. కానీ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

ఎవరు బాధ్యత తీసుకుంటారు...
ట్రంప్ వస్తున్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం దేశ వ్యతిరేకమన్నారు కిషన్ రెడ్డి. మత విభజనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు దేశానికి మంచిది కాదని, దీనికి బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారా.. అసదుద్దీన్ తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నవారి గురించి దేశ ప్రజలు ఆలోచించాలన్నారు. సీఏఏలో ఒక్క అక్షరం భారత పౌరులకు వ్యతిరేకంగా ఉన్నా మార్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. అసలు సీఏఏ వల్ల ఏ భారతీయులకు నష్టం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
Recommended Video


రేపు నార్త్ ఢిల్లీలో స్కూల్స్ మూసివేత..
ఇదిలా ఉంటే ఢిల్లీలో హింసాత్మక ఘటనలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆందోళనకారుల హింసలో రెండు ఇళ్లు,మూడు వాహనాలు దగ్దమయ్యాయి. ప్రస్తుతం నార్త్ ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. రాళ్ల దాడిలో గాయపడ్డవారిలో 20మంది జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నార్త్ ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మంగళవారం స్కూళ్లను మూసివేస్తున్నట్టు మంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications