ఒక్కడున్నాడు: లంచం నాకొద్దంటూ డెస్క్ పై ఏకంగా బోర్డు పెట్టిన ఉద్యోగి, సోషల్ మీడియాలో వైరల్
ఓ చిరుద్యోగి తాను పని చేసినందుకు ప్రభుత్వం జీతమిస్తోందని, తనకు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తాను పని చేసే డెస్క్ మీద ఏకంగా బోర్డే పెట్టి పాపులర్ అయిపోయాడు.
కేరళ: ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైలు కదలాలంటే లంచం ఇవ్వాల్సిందే. ఇది జగమెరిగిన సత్యం. నదిలో చేపలు నీళ్లు తాగవనడం ఎంత అవాస్తవమో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోడనడం కూడా అంతే అవాస్తవం.
అందుకేనేమో ఈ ఉద్యోగి వీటన్నిటికీ చెక్ పెట్టాలనుకున్నాడు. తాను పని చేసినందుకు ప్రభుత్వం జీతమిస్తోందని, తనకు లంచం ఇవ్వొద్దంటూ తాను పని చేసే డెస్క్ మీద ఏకంగా బోర్డే పెట్టేశాడు. అంతేకాదు, తన సేవలు సంతృప్తికరంగా లేకపోతే వెంటనే చెప్పాల్సిందిగా సూచించాడు.
కేరళకు చెందిన అబ్దుల్ సలీం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కాడు. ఇతగాడు తన పనితీరుతో వినియోగదారుల మెప్పు పొందడమేకాక పలువురి ప్రశంసలు కూడా పొందుతున్నాడు.
పల్లియల్ తోడి అంగడిపురం పంచాయతీ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్న అబ్దుల్ సలీం నెల జీతం రూ.24,340. ఇతడు తన డెస్క్ వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేసి, దానిపై ' ప్రజలకు సేవ చేసినందుకు నాకు ప్రభుత్వం జీతం ఇస్తోంది.. మీరు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు..'అంటూ రాసి ఉంచాడు.
ఈ ఆఫీసుకు వచ్చిన పలువురు సలీం పెట్టిన బోర్డు చూసి ముగ్గులవడమేకాక అతడితో ఫొటోలు కూడా దిగుతున్నారు. కొందరు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మనోడికి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది.
ఈ క్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం సలీం నిజాయితీని, స్ఫూర్తిని మెచ్చుకుంటూ ప్రశంసించారు. విచిత్రం ఏమిటంటే.. సలీం 40 శాతం పోలియోతో బాధపడుతున్నాడు.
పాక్షిక అంగవైకల్యం ఉన్నవాడే ఇంత గొప్పగా పనిచేస్తూ ఔధార్యం చాటుకుంటుంటే.. అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న ఉద్యోగులు ఇంకెంత గొప్పగా పనిచేయాలి? అంతేకాదు, ఆఫీసు పనులే కాకుండా తన సహాయం కోరి ఎవరు వచ్చినా తనకు చేతనైనంతలో వారికి అండగా నిలుస్తున్నాడు.
Appreciate the honesty & spirit of Mr. Abdul Saleem, Panchayat clerk in #Kerala. Public service should be the motto of every Govt employee. pic.twitter.com/kRH1qMLWgL
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 March 2017
ఇదంతా చదివాక మీకేమనిపిస్తోంది? ఇన్నాళ్ల భారతంలో ఓ క్లర్కు చేసిన పని సివిల్ సర్వీస్ పాసై వచ్చి, సూటు బూటు వేసుకుని దర్జాగా రివాల్వింగ్ చెయిర్ లో కూర్చుని, ఏసీ గదిలో క్రాఫు చెదరకుండా పనిచేసే ఐఎఎస్, ఐపీఎస్ లు కూడా చేయలేకపోయారు అనిపిస్తోంది కదూ!
మరి ఎవడన్నాడు సలీంకి పోలియో అని, జీతాల రూపంలో ప్రభుత్వం నుంచి వేలకు వేల డబ్బు దొబ్బుతూ ఇంకా డబ్బుపై మోజు తీరక లంచాలు మెక్కేందుకు ప్రయత్నించే ప్రతి ప్రభుత్వోద్యోగి 'పోలియో వ్యాధిగ్రస్థుడు'కానీ.. సలీం కాదు, అనిపిస్తోందా? అయితే అనండి.. శభాష్ సలీం అని!!