ఫలోంకా రాజ్: ఈ ఒక్క మామిడి పండు ధర రూ. 1000, ‘నూర్జహాన్’ ప్రత్యేక ఇదే
ఇండోర్: పండ్లలో రాజు అంటే ఎవరికైనా మామిడి పండే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. సీజన్ కావడంతో ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో మామిడి పండ్లు కిలో ధర రూ. 50-60 ఉంటోంది. అయితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జాతికి చెందిన మామిడి పండు ఒక్కదానికే రూ. 1000 పలుకుతుండటం గమనార్మం.
నూర్జహాన్ మామిడి పండ్లు మధ్యప్రదేశ్లోనే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అలీరాజ్పూర్ జిల్లాలో లభించే 'నూర్జహాన్' మామిడి పండ్లంటే ఎంతో ప్రత్యేకత కలిగినవి. దీంతో ఎంత రేటైన పెట్టేందుకు వినియోగదారులు ముందుకొస్తున్నారు. పూత దశలో ఉండగానే బుక్ చేసుకుంటుండటంతో ప్రస్తుతం ఈ జాతి మామిడి పండు రూ. 1000 పలుకుతోంది.
ఒక్కో మామిడికాయ మూడు కిలోలు..
ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో దిగుబడి బాగా వచ్చిందని నూర్జహాన్ మామిళ్లను పండించే రైతులు చెబుతున్నారు. ఒక్కో మామిడి కాయ మూడు కిలోల వరకు తూగుతున్నట్లు రైతులు తెలిపారు. గత ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా ఒక్కో పండు 2.5 కిలోల వరకే పరిమితమైనట్లు రైతులు చెప్పారు. కరోనా ప్రభావంతో గత ఏడాది సీజన్లో పెద్దగా డబ్బులు కూడా రాలేదని వాపోయారు.
నూర్జహాన్ మామిడి పండ్ల స్పెషల్ ఇదే..
అయితే, ఈసారి మాత్రం వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండాయని, గిరాకీ కూడా బాగా వస్తోందని రైతులు తెలిపారు. ఒక్కో నూర్జహాన్ మామిడి పండుకు రూ. 1000 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. 2019లో దీని ధర రూ. 1200 వరకు ఉండటం గమనార్హం. కాగా, జనవరి, ఫిబ్రవరిలో ఈ మామిడి చెట్లు పూతకు వస్తాయి. జూన్ ప్రారంభంలో పండ్లు చేతికొస్తాయని రైతులు తెలిపారు. ఈ మామిడి కాయలు ఒక్కొక్కటి అడుగుమేర పొడవు ఉండటం విశేషం. ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఈ మామిడిపళ్లను గుజరాత్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలోనే పండిస్తారు.
ముందే బుకింగ్స్.. మూడు చెట్లకే 250 మామిడి పండ్లు..
నా పేరటిలో మూడు నూర్ఝహాన్ మామిడి పండ్ల చెట్లు ఉన్నాయని, అవి సుమారు 250 మామిడి కాయలు కాశాయి. ఒక్కొక్కటి రూ. 500 నుంచి రూ. 1000 వరకు అమ్మాను. ఇప్పటికే అన్ని మామిడి పండ్లకు బుకింగ్స్ కూడా అయిపోయాయిని కత్తివాడకు చెందిన శివరాజ్ సింగ్ జాదవ్ అనే రైతు తెలిపాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచే కాక, గుజరాత్ కు చెందిన పలువురు కూడా కొనుగోలు చేశారని చెప్పాడు. ఒక్కో మామిడి పండు 2 నుంచి 3.5 కిలోల బరువు ఉందని తెలిపాడు. కరోనా లేకుంటే మామిడిపండ్ల వ్యాపారం ఇంకా బాగుండేదని నూర్జహాన్ పంటల నిపుణుడు ఇసాక్ మన్సూరి చెప్పారు.