ఇంతవరకూ! నెగ్గినోడే లేడు: ఢిల్లీ హోటల్ ఛాలెంజ్.. ఆ మూడు పరోటాలు తింటే
మీరు భోజన ప్రియులా?.. ఆవురావురుమంటూ ఆరగించే అలవాటుందా?.. అయితే ఢిల్లీలోని ఓ పరోటా హోటల్ మీకు ఆహ్వానం పలుకుతోంది. వాళ్లు విసిరే ఛాలెంజ్లో గనుక మీరు నెగ్గితే.. జీవితాంతం ఉచితంగా వాళ్లే తిండి పెడుతారట.
న్యూఢిల్లీ: మీరు భోజన ప్రియులా?.. ఆవురావురుమంటూ ఆరగించే అలవాటుందా?.. అయితే ఢిల్లీలోని ఓ పరోటా హోటల్ మీకు ఆహ్వానం పలుకుతోంది. వాళ్లు విసిరే ఛాలెంజ్లో గనుక మీరు నెగ్గితే.. జీవితాంతం ఉచితంగా వాళ్లే తిండి పెడుతారట.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఢిల్లీ-రోహ్తక్ బైపాస్ రోడ్డులో పరాటా జంక్షన్ అనే ఓ హోటల్ ఉంది. ఈ హోటల్ యజమాని గత కొన్నాళ్లుగా ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. తమ హోటల్లో తయారుచేసే మూడు పరోటాలను 50ని.ల్లోగా ఆరగించాలి. అలా చేస్తే జీవితాంతం ఉచితంగా తిండి పెడుతానంటున్నాడు.
ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆ మూడు పరోటాల డబ్బులు కట్టాల్సిందే. అబ్బే.. పరోటాలు తినలేమా!.. అని తేలిగ్గా తీసిపారేయకండి. అవి మామూలు పరోటాలు కాదు. ఒక్కోటి కిలో బరువుతో.. ఒక అడుగు, 6 అంగుళాల పరిణామంలో ఉంటాయి. ఇలాంటివి మూడు పరోటాలను 50నిమిషాల్లో ఆరగించాలి.
ఇప్పటికైతే ఈ ఛాలెంజ్లో ఎవరూ నెగ్గలేదు. ప్రతీరోజు చాలామందే ప్రయత్నిస్తారు గానీ ఇంతవరకు ఎవరూ సక్సెస్ కాలేకపోయారు. ఈ హోటల్ ఛాలెంజ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోటల్ ముందు 'హిందుస్థాన్ కా సబ్ సే బడా పరోటా' అని రాసి పెట్టి ఉండటం విశేషం.