కరోనా కలకలం: తీహార్ జైలు నుంచి 419 మంది ఖైదీల విడుదల, త్వరలో మరో 2581 ఖైదీలు కూడా
న్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తీహార్ జైలులోని 419 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బెయిల్పై, మరో 63 మందిని ఎనిమిది వారాల అత్యవసర పెరోల్పై విడుదల చేసినట్లు వివరించారు.
కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంోలనే జైళ్లలో రద్దీ తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. మొత్తం 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగానే తొలి విడతలో శనివారం 419 మంది ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపారు.
మరికొద్ది రోజుల్లోనే మిగితా ఖైదీలను కూడా విడుదల చేస్తామని తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం కేవలం నాలుగు వారాల పెరోల్ మాత్రమే అనుమతించేవారమని, అయితే, ప్రస్తుత కరోనా భయాందోళనల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసేందుకు నిబంధనలను సడలించినట్లు వెల్లించారు.
తీహార్ జైలు సామర్థ్యం 10వేల మంది కాగా, ప్రస్తుతం అక్కడ 18వేల మంది ఖైదీలు ఉన్నట్లు సమాచారం. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ 71 కాగారాల్లోని 11వేల మంది ఖైదీల్ని ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నాయి.
తాజాగా, మహారాష్ట్రలో చోటు చేసుకున్న మరణంతో మనదేశంలో కరోనావైరస్ మరణాల సంఖ్య 27కు చేరింది. కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 379కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో కేసుల సంఖ్య భారీగా పెరగడం లేదు. అయితే, కొంత మంది కరోనా బాధితులు నిర్లక్ష్యం వ్యవహరించడం ద్వారా కొత్త కేసులు నమోదవుతున్నాయి.