Tit For Tat: శివసేన కోర్టుకు ... మహాపాలన రాష్ట్రపతికి, ఏం జరుగుతోంది..?
మహారాష్ట్రలో రాజకీయపరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. క్షణం క్షణంకు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని చెబుతూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్కు చెప్పిన సమయం నుంచే రాజకీయాలు వేడెక్కాయి. శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావడంతో ఆ ఛాన్స్ ఎన్సీపీకి దక్కింది. ఎన్సీపీకి ఇచ్చిన సమయం ముగియకముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శివసేనకు బీజేపీ చెక్ పెడుతోందా..?
మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న ఎత్తులు పై ఎత్తులు వ్యూహప్రతి వ్యూహాలకు కేంద్రం చెక్ పెట్టింది. తమను కాదంటూ వైరిపక్షాలతో శివసేన చేతులు కలపడంతో తమ బ్రహ్మాస్త్రం బయటకు తీసింది. తమను విబేధించిన శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో మరో ఛాన్స్ ఇవ్వకూడదని బీజేపీ డిసైడ్ అయ్యింది. గవర్నర్ ఎన్సీపీకి అవకాశం ఇచ్చినా అదే గవర్నర్తో నివేదిక తెప్పించుకుని మరీ రాష్ట్రపతి పాలనకు ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా మెజార్టీ పరంగా తమకు దక్కాల్సిన అధికారం ధిక్కారం ద్వారా దక్కించుకోవాలనుకున్న శివసేనకు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. అదేవిధంగా ఎన్సీపీ కాంగ్రెస్లకు అవకాశం లేకుండా చేసింది.

సుప్రీంకోర్టుకు వెళ్లగానే రాష్ట్రపతి పాలన ఎందుకు..?
ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మూడు రోజుల సమయం ఇచ్చిన గవర్నర్... తమకు మాత్రం ఒక్క రోజే సమయం ఇవ్వడాన్ని శివసేన తప్పుబడుతోంది. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలంటూ సుప్రీం గడపను తొక్కింది కాషాయం పార్టీ. ఇక దీన్నే సీరియస్గా కేంద్రం తీసుకున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వాదనలకు రాకముందే కేంద్రం శరవేగంగా పావులు కదిపినట్లు సమాచారం. ఒకవేళ సుప్రీంకోర్టులో శివసేనకు అనుకూలంగా తీర్పు వస్తే ఆ పార్టీ లాభపడే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడే రాష్ట్రపతి పాలన విధిస్తే , ఇప్పటికే రాష్ట్రపతి పాలన ఉన్నందున తామేమీ జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పే అవకాశాలున్నాయి.

బీజేపీ చెప్పినట్లుగా గవర్నర్ నడుచుకుంటున్నారు: శివసేన
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్సింగ్ ఎన్సీపీకి అవకాశం ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 8:30 గంటల వరకు ఆ పార్టీకి సమయం ఉంది. అయితే ఈలోగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలంటూ తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇటు శివసేనకు అటు ఎన్సీపీ కాంగ్రెస్లకు షాక్ ఇచ్చింది. అయితే ఇది కేంద్రం తెరవెనక ఉండి నడిపిస్తోందని కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఆడించినట్లుగా గవర్నర్ ఆడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది శివసేన.












Click it and Unblock the Notifications