బీజేపీ శవపేటికపై చివరి మేకు టీఎంసీదే ఉంటుంది: స్వరం పెంచిన మమతా
బంకురా (పశ్చిమ బెంగాల్): ఢిల్లీలో బీజేపీని ఆమ్ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడించడంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వరం పెంచారు. కాషాయం పార్టీ కథ ఆయా రాష్ట్రాల్లో క్రమంగా ముగిసిపోతోందని వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత బీజేపీ శవపేటికపై చివరి మేకు టీఎంసీదే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఘనవిజయం అందించి ప్రజలు విభజన రాజకీయాలకు చెక్ పెట్టారంటూ కామెంట్ చేశారు.

బీజేపీ అంత్యక్రియలు నిర్వహించేది టీఎంసీనే
అంతకుముందు ఢిల్లీ ఫలితాలపై మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇక ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన అక్కడ బీజేపీకి ఓటమి తథ్యమని మరోసారి రుజువైందని మమతా అన్నారు. బంకుర్లో ప్రసంగించిన దీదీ... ఢిల్లీలో బీజేపీ ఖేల్ ఖతం అయ్యిందన్న మంచి వార్తతో తానుముందుకొచ్చినట్లు చెప్పారు. ఇక 2018 నుంచి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ జాడ కనిపించడంలేదని క్రమంగా ప్రాభవం కోల్పోతోందని వ్యాఖ్యానించిన మమతా బెనర్జీ 2021లో టీఎంసీ బీజేపీ అంత్యక్రియలు నిర్వహిస్తుందంటూ వ్యాఖ్యానించారు. బీజేపీని డబ్బు కూడా కాపాడలేదని చెప్పిన మమతా బెనర్జీ.. మహిళలు యుద్ధానికి శంఖం పూరించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బీజేపీ వెదజల్లుతున్న డబ్బుల కంటే తన తల్లులు, అక్క చెల్లెళ్ల సమరనాధమే బలమైనదిగా అభివర్ణించారు మమతా.

కేజ్రీవాల్ను బీజేపీ ఇబ్బందులకు గురిచేసింది
ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ను బీజేపీ ఇబ్బందులకు గురిచేసిందని గుర్తుచేసిన మమతా బెనర్జీ.. ఆ సమయంలో కేజ్రీవాల్కు అండగా నిలిచామన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కు పట్టం కట్టడంపై హర్షం వ్యక్తం చేసిన దీదీ... ఇది ప్రజావిజయంగా అభివర్ణించారు. విషం చిమ్మాలన్న బీజేపీ ప్రయత్నం ఎక్కడా ఫలించలేదని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య విజయం అని కొనియాడిన మమతా బెనర్జీ... ఢిల్లీ ప్రజలను అభినందించారు. ఢిల్లీని వశపరుచుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నం ఫలించలేదని చెప్పారు. ప్రజలకు విభజన విద్వేష రాజకీయాలు వద్దని తమకు కావాల్సిందల్లా కనీస సదుపాయాలు, సౌకర్యాలు అని చెప్పారు.

బీజేపీ విద్వేష చర్యలకు దిగింది
దేశ ప్రజలు కూడా కోరుకుంటోంది ఉద్యోగాలు, ఆహార భద్రత, కట్టుకునేందుకు బట్టలు, ఉండేందుకు ఇళ్లు అభివృద్ధి, మరియు ప్రశాంతత అని చెప్పారు దీదీ. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా... జార్ఖండ్లో బీజేపీ ఓటమిపాలైందన్న విషయాన్ని మమతా గుర్తుచేశారు. గతేడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలైందన్నారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం విజయాన్ని మేనేజ్ చేసుకున్నారని మమతా అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా దేశాన్ని రావణకాష్టగా మార్చారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications