ఆర్ టీసీ సమ్మె ఎఫెక్ట్: రూ. 750 కోట్ల నిధులు, సీఎం, సంక్రాంతి దెబ్బ, దీవాలా తీసింది !
చెన్నై: తమిళనాడు ఆర్ టీసీ కార్మికుల డిమాండ్లకు చివరికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జీతాలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చెయ్యాలని తదితర డిమాండ్లతో తమిళనాడు ఆర్ టీసీ కార్మికులు గత ఏడు రోజుల నుంచి మెరుపు సమ్మె చేయ్యడంతో సీఎం రూ. 750 కోట్ల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
పళని, పన్నీర్ ఎంట్రీ
తమిళనాడు రవాణా శాఖ మంత్రి ఎంఆర్. విజయ్ భాస్కర్ ఆర్ టీసీ కార్మికులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసి సీనియర్ మంత్రులతో చర్చించారు.
ప్రతిపక్షాలు
ఆర్ టీసీ సమ్మె కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. ఆర్ టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించిన తమిళనాడు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.
రూ. 750 కోట్ల నిధులు
ఆర్ టీసీ కార్మికులకు సంక్రాంతి పండగలోపు రూ. 750 కోట్ల నిధులు విడుదల చేస్తామని బుధవారం శాసన సభ సమావేశాల్లో ఎడప్పాడి పళనిస్వామి చెప్పారు. కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని తమిళనాడు ప్రభుత్వం మనవి చేసింది.
విడుదల చెయ్యాలి
నిధులు మొత్తం విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించిన తరువాతే విధుల్లోకి వస్తామని కార్మిక సంఘాలు అంటున్నాయి. నిధులు విడుదల చెయ్యడానికి చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని, అందుకు సమయం పడుతోందని ప్రభుత్వం అంటోంది.
ప్రభుత్వం దీవాలా తీసింది
తమిళనాడు ప్రభుత్వం దివాలా తీసిందని, ఆర్ టీసీ కార్మికుల సమస్యలు తీర్చడం లేదని, ప్రజల కష్టాల గురించి పట్టించుకోవడం లేదని, శాసన సభ సమావేశాల్లో ప్రతిపక్షాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ బుధవారం టీటీవీ దినకరన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.