ట్రంప్ వ్యాఖ్యలకు మోడీ ఘాటు కౌంటర్..! మాది టాప్ త్రీ ప్లాన్..!
రష్యా నుంచి చమురు కొంటున్నామనే కారణంతో భారత్ పై ప్రతీకారంగా 25 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతటితో ఆగకుండా మనది డెడ్ ఎకానమీ (మృత ఆర్ధిక వ్యవస్థ) అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. డెడ్ ఎకానమీలు కలిగిన రష్యా, భారత్ ఏం చేసుకుంటాయో తనకు అనవసరమని, ఇంకా పతనం కావడం మాత్రం ఖాయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇవాళ వారణాసిలో భారత ప్రధాని మోడీ స్పందించారు.
భారత్ ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ట్రంప్ కు మోడీ చురకలు అంటించారు. త్వరలో తాము మూడో అతిపెద్ద వ్యవస్థగా మారబోతున్నామంటూ మోడీ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సైతం పరోక్షంగా సమర్ధించుకున్నారు. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై ట్రంప్ విమర్శలు చేస్తున్న వేళ మోడీ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్ తమ ప్రాధాన్యతలపై అప్రమత్తంగా ఉంటోదని, స్వదేశీ వస్తువుల తయారీని ప్రోత్సహిస్తుందని మోడీ వారణాసిలో తెలిపారు. ఈ విధానం ఇకపైనా కొనసాగిస్తామని తేల్చి చెప్పేశారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నడుస్తోందంటూ ట్రంప్ సుంకాల మోతకు సైతం చురకలు అంటించారు. ఇలాంటి పరిస్ధితుల్లో దేశ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని మోడీ తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో అస్థిరత వాతావరణం నెలకుందని, అన్ని దేశాలు తమ వ్యక్తిగత ప్రయోజనాలపై దృష్టి సారిస్తున్నాయని మోడీ తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని, అందుకే తన ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం చేయగలిగినదంతా చేస్తోందన్నారు. దేశం మేలు కోరుకునేవారు, భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడాలనుకునేవారు, అది ఏ రాజకీయ పార్టీ అయినా, తమ విభేదాలను పక్కనపెట్టి స్వదేశీ ఉత్పత్తులకు మద్దతుగా కలిసి రావాలన్నారు.












Click it and Unblock the Notifications