సరికొత్త వ్యూహం: రాళ్లు రువ్వి అసలు నిందితులను పట్టేశారు
శ్రీనగర్: ఉగ్రవాదులు, వేర్పాటువాదుల ప్రోత్సాహంతో పోలీసులు, భద్రతాదళాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సాధారణమైపోయింది. ఈ క్రమంలో అసలైన నిందితులను పట్టుకునేందుకు భద్రతా దళాలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.
కొంతమంది పోలీసులు కాసేపు ఆందోళనకారులుగా అవతారమెత్తి అసలు నిందితులను పట్టుకున్నారు. జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనలు ముగియగానే కొందరు గుంపుగా వచ్చి సీఆర్పీఎఫ్ జవాన్లపై రాళ్లు విసరడం ప్రారంభించారు.
అయితే జవాన్లు ప్రతిస్పందించలేదు. బాష్పవాయువు ప్రయోగం, లాఠీ ఛార్జీవంటివి చేయలేదు. ఎందుకంటే సాదాదుస్తుల్లో ఉన్న కొందరు పోలీసులు కూడా అందులో ఉండటమే కారణం. కొద్దిపేపటి తర్వాత దాదాపు వంద మంది అక్కడ పోగయ్యారు.
ప్రతిసారీ ఈ గుంపునకు నాయకత్వం వహించే ఇద్దరు వ్యక్తులు ఈసారీ వచ్చి రాళ్లు విసరడం ప్రారంభించారు. దీంతో వారిని చెదరగొట్టడానికి జవాన్లు ఒకసారి బాష్పవాయువు గోళీని ప్రయోగించారు.
అంతలోనే గుంపులో కలిసి ఉన్న పోలీసులు ఆ ఇద్దరు నాయకులను గట్టిగా పట్టుకొని అక్కడ నిలిపి ఉంచిన వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసి అసలైన నిందితులను పట్టుకోవడంపై పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి.