ఈరోజు నా కుమార్తెపై దాడి.. రేపు నాపైనే జరగవచ్చు : ఐషే ఘోష్ తండ్రి ఆవేదన
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో జరిగిన హింసాకాండలో జేఎన్ఎస్ఎయూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై ఘోష్ తల్లిదండ్రులు స్పందించారు. పరిస్థితుల్ని చూస్తుంటే దేశవ్యాప్తంగా అస్థిరత నెలకొందన్నారు. అంతేకాదు,తనపై కూడా దాడి చేసే ప్రయత్నం జరిగిందన్నారు. జేఎన్యూలో జరిగిన ఘటన తమను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు.
దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జేఎన్యూలో జరిగిన దాడికి తీవ్ర ఆందోళన చెందుతున్నాం. ఈరోజు కుమార్తెపై దాడి జరిగింది. రేపు మరొకరిపై దాడి జరుగుతుంది. ఎవరికి తెలుసు,రేపు నాపైనే దాడి జరగవచ్చు' అంటూ ఘోష్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వామపక్షవాదులు ప్రతిఘటన ఎదుర్కొంటున్నారని,తన కుమార్తె వామపక్ష ఉద్యమాలతో ఉన్నందునే.. వారిపై దాడి జరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా వామపక్ష ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

జరిగిన హింసాకాండకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వీసీ రాజీనామా చేయాల్సిందిగా ఘోష్ తల్లి డిమాండ్ చేశారు. జరిగిన దానికి భయపడిపోయి నిరసనల నుంచి తప్పుకోమని తన కుమార్తెను కోరనన్నారు. క్యాంపస్లో ఎన్నో ఘటనలు జరుగుతున్నా వీసీ మాత్రం నేరుగా విద్యార్థులతో మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువ విద్యార్థులు సాగిస్తున్న ఉద్యమంలో.. ఎంతోమంది ఈ దాడిలో గాయపడ్డారని, అలా అని వారిని నిరసనల నుంచి తప్పుకోమనే సలహా ఇవ్వనని చెప్పారు.
కాగా,జేఎన్యూ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం ముఖాలకు మాస్కులు,చేతుల్లో ఆయుధాలతో క్యాంపస్లోకి చొరబడ్డ మూక.. హాస్టల్లలోకి వెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో జేఎన్యూఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా 20 మంది గాయపడ్డారు. దాడిపై ఏబీవీపీ విద్యార్థి సంఘం,వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యూనివర్సిటీ వీసీని కోరారు.












Click it and Unblock the Notifications