చైనా మెడ వంచేలా: సరిహద్దుల్లో భారత బ్రహ్మాస్త్రం: వైమానిక దళ కమాండర్ల కీలక భేటీ: 22 నుంచి
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ వివాదాలను సృష్టిస్తూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోన్న చైనా మెడ వంచేలా భారత్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి భారత వైమానిక దళాధికారులు, కమాండర్లు రెండురోజుల పాటు సమావేశం కానున్నారు. ఈ నెల 22వ తేదీన దేశ రాజధాని వేదికగా ఈ భేటీ ఆరంభం కాబోతోంది. భారత వైమానిక దళం అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంగా భావించదగ్గ అత్యాధునిక ర్యాపిడ్ రాఫెల్ యుద్ధ విమానాలను వాస్తవాధీన రేఖ వద్ద మోహరింపజేయడానికి సమాయాత్తమౌతుంది కేంద్రం.
Recommended Video
వైమానిక దళాధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా ఈ సమావేశానికి సారథ్యాన్ని వహిస్తారు. వైమానిక దళంలో అత్యంత కీలకంగా వ్యవహరించే ఏడుమంది కమాండర్ ఇన్ చీఫ్ అధికారులతో ఈ భేటీకి హాజరవుతారు. లఢక్ సహా చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల సరిహద్దులకు చెందిన వైమానిక దళ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొనబోతున్నారు. ర్యాపిడ్ రాఫెల్ యుద్ధ విమానాలను సరిహద్దులలో మోహరించడం అనే అజెండాపై ప్రధానంగా వారి మధ్య చర్చలు కొనసాగుతాయని వాయుసేన అధికారులు వెల్లడించారు.
వాస్తవాధీన రేఖ వెంబడి గల గాల్వన్ వ్యాలీ ప్రాంతాన్ని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోయాయి. డెప్సాంగ్, పంగ్యంగ్ త్సొ ప్రాంతాలను ఖాళీ చేయడానికి చైనా సైనికులు మొండికేస్తున్నారు. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రదేశాలు ఈ రెండూ. వాటిని ఖాళీ చేయించడానికి కొద్ది రోజుల కిందటే భారత్-చైనా మధ్య ఆర్మీ కమాండర్ స్థాయి చర్చలు చోటు చేసుకున్నాయి. అవి ఫలించలేదు. పంగ్యంగ్ త్సొ, డెప్సాంగ్ను ఖాళీ చేయించడానికి చైనా అంగీకరించలేదు. ఈ అంశంపై ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నెల చివరి వారం నాటికి ఫ్రాన్స్ నుంచి ర్యాపిడ్ రాఫెల్ యుద్ధ విమానాలు భారత చేతికి అందబోతున్నాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం.. మరో రెండునెలల తరువాత రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేతికి అందాల్సి ఉన్నప్పటికీ.. చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ముందుగానే వాటిని రప్పించుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా కొన్ని యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరబోతున్నాయి. తమ చేతికి అందిన వెంటనే వాటిని లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్దకు తరలించాలా? వద్దా? అనే అంశంపై వైమానిక దళ కమాండర్ల స్థాయి అధికారులు చర్చించబోతున్నారు.