పీఎన్బీ స్కాంలో పెద్దల హస్తం, వారి వల్లే: కేజ్రీవాల్ సంచలనం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా వేల కోట్ల కుంభకోణాలు ఎలా సాధ్యమవుతాయని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. స్వచ్ఛ పాలన అని చెప్పుకుంటున్న బీజేపీ.. గతంలో కాంగ్రెస్ లాగే కుంభకోణాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
రెండు పార్టీల నైజం ఒకటేనని కేజ్రీవాల్ అన్నారు. పెద్దల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడటం సాధ్యం కాదన్నారు. 11వేల కోట్ల కుంభకోణం చేసిన నీరవ్ మోడీ దేశం నుంచి ఎలా పారిపో గలిగాడని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి విజయ్ మాల్యా ఎలా విదేశాలకు వెళ్లగడిగాడని అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు. కేంద్రంలోని పెద్దల సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన ఆరోపించారు.
తమ సొమ్ముకు భద్రత లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. వేల కోట్లు కుంభకోణాలు చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందని అన్నారు.