Video: కొడుకు మారం, తప్పని మరణం.. ఐఫోన్ క్రేజ్ ఎంత పని చేసిందంటే?
ఒక్క ఫోన్ మోజు, అది తెచ్చిపెట్టిన అప్పుల భారం ఒక పచ్చని కుటుంబాన్ని నిలువునా బలితీసుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా పరిధిలోని దేవలాయ్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే విషాద సంఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఈఎంఐ కిస్తీ డబ్బుల విషయంలో తండ్రితో గొడవపడి, ఆవేశంలో కొండపైకిక్కిన 18 ఏళ్ల కుర్రాడు.. అతడిని కాపాడుకోవడానికి వెళ్లిన తండ్రి, ఇద్దరినీ కళ్లముందే కోల్పోయి తట్టుకోలేకపోయిన తల్లి.. ముగ్గురూ కొండపై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. 18 ఏళ్ల కునాల్ చందగూడే అనే యువకుడు ఇటీవలే ఖరీదైన ఐఫోన్ కొనుగోలు చేశాడు. అయితే, దానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐ కోసం ఇంట్లో నిత్యం గొడవపడుతున్నాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి మురళీధర్తో ఈఎంఐ డబ్బుల విషయమై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కునాల్, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి సమీపంలోని తిస్గావ్ కొండపైకి ఎక్కాడు. కొండ అంచున నిలబడి కిందకి దూకేస్తానని బెదిరించడం ప్రారంభించాడు.

మూడు గంటల నరకం.. 'అమ్మా నాన్నల కోసం బ్రతుకురా!'
విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, స్థానిక సర్పాంచ్ సంజయ్ జాధవ్, గ్రామస్థులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు కునాల్ను కిందకు తీసుకురావడానికి సర్వవిధాలా ప్రయత్నించారు. "నానా! నీకు ఏది కావాలంటే అది కొనిస్తాం, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మను చూసైనా కిందకి దిగి రారా" అని సర్పాంచ్, పోలీసులు ఎంతో బతిమిలాడారు. "నాకు చావే శరణ్యం, వేరే దారి లేదు" అంటూ కునాల్ భీష్మించుకూర్చున్నాడు. కొండ కింద నిలబడి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొండపైకి చేరుకుని కొడుకుని బతిమాలే ప్రయత్నం చేశారు.
క్షణాల వ్యవధిలోనే ముగిసిన మూడు ప్రాణాలు!
మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండ అంచుకు మరింత దగ్గరగా వెళ్లిన కొడుకుని కాపాడుకోవాలనే ఆరాటంతో.. తండ్రి మురళీధర్ ముందుకు వెళ్లి అతడిని వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కొండ అంచు నుంచి తండ్రీకొడుకులిద్దరూ లోతైన లోయలో పడిపోయారు. కళ్లముందే భర్త, కొడుకు రక్తం మడుగులో పడిపోవడం చూసిన తల్లి సంగీత తట్టుకోలేకపోయింది. తీవ్ర దిగ్భ్రాంతితో ఆమె కూడా వెంటనే కొండపై నుంచి కిందకి దూకేసింది.
గ్రామంలో మిగిలిన తీవ్ర శోకసంద్రం!
తీవ్ర గాయాలపాలైన ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వాలూజ్ ఎంఐడీసీ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ఘటనను అక్కడున్న పలువురు సెల్ఫోన్లలో రికార్డ్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. చిన్న విషయానికి దారితీసిన గొడవ, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలితీసుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.













Click it and Unblock the Notifications