రిసార్ట్ లో 50 రూములు బుక్ చేసిన విజయ్- నో మీడియా
తమిళనాడులోని కరూర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడ్డ వారిని తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ కలుసుకున్నారు. వారితో ముఖాముఖి సమావేశం అయ్యారు. చెన్నై శివార్లలోని మామళ్లాపురంలో గల ఓ స్టార్ హోటల్ లో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సాయంత్రం వరకు కొనసాగనుంది. కొద్దిసేపటి కిందటే విజయ్, ఇతర పార్టీ నాయకులు హోటల్ కు చేరుకున్నారు.
ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. మీడియాకు అనుమతి ఇవ్వలేదు. చివరికి పార్టీ నాయకులకు కూడా ఇందులో పాల్గొనే అవకాశాన్ని కల్పించలేదు. విజయ్ తో పాటు మరో అయిదుమంది మాత్రమే దీనికి ఇందులో పాల్గొన్నారు. వాళ్లు కూడా విజయ్ కు అత్యంత విశ్వాసపాత్రులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా బాధితులకు ఆయన సాంత్వన పలికారు. సహాయాన్ని అందించారు. గాయపడ్డ వారికి ఉపశమనం కల్పించారు.

కిందటి నెల 27వ తేదీన కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో సంభవించిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే. వారి కుటుంబీకులతో పాటు గాయపడ్డ వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా టీవీకే నుంచి ఆహ్వానాలు అందాయి. జిల్లా స్థాయి పార్టీ నాయకులు వారిందరినీ ప్రత్యేక వాహనాల ద్వారా మామళ్లాపురం రిసార్ట్ కు తరలించారు. వారికోసం 50 గదులను బుక్ చేశారు. ఆదివారం రాత్రికే వాళ్లంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఉదయంతో వారితో విజయ్ సమావేశం అయ్యారు.
ఈ ఉదయం చెన్నైలోని తన నివాసం నుంచి బయలుదేరిన విజయ్ సరిగ్గా 8:59 నిమిషాలకు మామల్లాపురంలోని రిసార్ట్కు చేరుకున్నారు. ఆ వెంటనే మీటింగ్ హాల్ లోనికి వెళ్లిపోయారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్ కావడం వల్ల మీడియాకు గానీ, పార్టీ నాయకులకు గానీ అనుమతించలేదు. ఎంపిక చేసిన అయిదుమంది నాయకులు మాత్రమే దీనికి హాజరయ్యారు. విజయ్ తో పాటు వాళ్లూ ఒకేసారి సమావేశ హాలులోనికి వెళ్లారు.
బాధితులతో గతంలో విజయ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. వారిని ఓదార్చారు. ప్రత్యక్షంగా కలుసుకుంటానని వెల్లడించారు. విజయ్ స్వయంగా వారి ఇళ్లకు వెళ్తారనే ప్రచారం మొదట్లో జరిగింది. భద్రతపరమైన ఇబ్బందులు, జనం భారీగా గుమికూడటం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున.. దీన్ని విమరించుకున్నారాయన. అందుకే- బాధితులను రిసార్టుకు పిలిపించి వారితో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా విజయ్ ఏం మాట్లాడారనేది, వారికి ఏ సహాయం చేశారనేది, ఏ హామీ ఇచ్చారనేది.. ఇంకా తెలియరావాల్సి ఉంది. దీనికి సంబంధించినంత వరకు పూర్తి వివరాలతో కూడిన ఓ అధికారిక ప్రకటన ఈ సాయంత్రానికి విడుదల అయ్యే అవకాశం ఉందని టీవీకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మీడియా గానీ, పార్టీ నాయకులు గానీ పెద్ద సంఖ్యలో ఈ మీటింగ్ కు వస్తే.. కొంత గందరగోళం నెలకొంటుందని విజయ్ అభిప్రాయపడినట్లు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications