Vijay TVK party:వాళ్లు ఫాసిస్టులైతే మీరేమన్న పాయసమా: డీఎంకేకు ఇచ్చిపడేసిన విజయ్..!!
Vijay TVK party:తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించింది.తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు సూపర్ స్టార్ విజయ్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం పలువురిని ఆలోచింపజేసింది. విజయ్ ప్రసంగంలో ముఖ్యంగా బీజేపీని డీఎంకేని టార్గెట్ చేసినట్లుగా కనిపించింది.విల్లుపురం జిల్లా విక్రవండిలో జరిగిన బహిరంగ సభలో విజయ్ చాలా విషయాలు చెప్పుకొచ్చారు.
తమిళనాడులో తన ప్రథమ రాజకీయ శతృవుగా బీజేపీ, ఆ తర్వాత డీఎంకే అని స్పష్టం చేశాడు విజయ్.ప్రజారంజకమైన పాలనకు డీఎంకే తూట్లు పొడుస్తోందని ఆరోపించిన విజయ్..దీన్నే ద్రవిడుల పాలనగా చూపిస్తూ ప్రజలను డీఎంకే మోసం చేస్తోందని విమర్శించారు. ఫాసిజం ఫాసిజం అని చెప్పే డీఎంకే పార్టీ ఏంటి.. వారిది పాయసమా అంటూ సెటైర్లు వేశారు విజయ్.

కచ్చితంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు వేదికపైకి వచ్చిన విజయ్ని చూసిన అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు విజయ్.టీవీకే పార్టీ ప్రాథమిక సూత్రం అందరూ సమానులే అని చెప్పారు. విద్వేషపూరితమైన రాజకీయాలకు టీవీకే దూరం అని చెప్పిన తళపతి.. ఈ దేశాన్ని దేశ ప్రజలను విభజించి పాలిస్తున్న బీజేపీ పార్టీ విధానపరంగా మన ప్రథమ శతృవు అని చెప్పుకొచ్చారు.
డీఎంకేను టార్గెట్..
ఇక డీఎంకే పార్టీని టార్గెట్ చేసిన విజయ్... ఆ పార్టీ తమ స్వలాభం కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు.ద్రవిడులకు ప్రతిబింబం తామే అని చెప్పుకుంటున్న కుటుంబం పెరియార్, అన్నాదురై లాంటి మహానుభావుల పేర్లకు మకిలి అంటిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ, ఆ కుటుంబ పెద్దలు తమకు రాజకీయ శతృవులని చెప్పారు. అంతకుముందు విజయ్ వాయిస్ ఆడియో రూపంలో వినిపించింది. "నేను అధికారంలోకి రాబోతున్నాను.లౌకిక, సామాజిక న్యాయం, విధానాలతో ప్రజల కోసం పనిచేసేందుకు రాబోతున్నాను." అని ఆడియోలో ఉంది. ఆ తర్వాత తన ప్రసంగంలో కూడా విజయ్ ఇదే చెప్పారు.

ఇదే మా జెండా..అజెండా..
ఇక పెరియార్ గురించి మాట్లాడుతూ తామెప్పుడు నాస్తికత్వం అనే అంశాన్ని తీసుకోమని చెప్పారు.మరోవైపు ఒకే దేవుడు-ఒకే మానవుడు అని నినదించిన అన్నాదురై మాటలను స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పారు.అయితే సమాజంలో మార్పురావాలంటే విద్య, మహిళా సాధికారతతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మిన పెరియార్ విధానాలను అనుసరిస్తామని విజయ్ పునరుద్ఘాటించారు.
ద్రవిడ పార్టీలు ఏవైతే కొన్ని డిమాండ్లను దశాబ్దాలుగా వినిపిస్తున్నాయో వాటినే విజయ్ కొత్త పార్టీ కూడా టేకప్ చేసింది.రెండు భాషల విధానం,తమిళనాడుకు ప్రత్యేక స్వతంత్ర గుర్తింపు,కేంద్ర జాబితాలో ఉన్న విద్య అంశాన్ని రాష్ట్ర జాబితాలోకి బదిలీ చేయడం వంటి అంశాలను విజయ్ కూడా ప్రధానాంశాలుగా ప్రస్తావించారు. అంతేకాదు గవర్నర్ పోస్టుకు తాము వ్యతిరేకమని, అదే సమయంలో మదురైలో మరో సెక్రటేరియట్ బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.అసెంబ్లీలో మహిళలకు 33శాతం టికెట్లను రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications