బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరి దుర్మరణం, నలుగురికి తీవ్రగాయాలు!
బెంగళూరు: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి నిద్రలో ఉన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెంది అనేక మంది కార్మికులకు గాయాలైన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరు నగరంలోని యశవంతపురలోని ఆర్ఎంసీ యార్డులో శుక్రవారం వేకువ జామున భవనం కుప్పకూలింది.
ఆర్ఎంసీ యార్డులో పార్కింగ్ కోసం రెండు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. శుక్రవారం వేకువ జామున 4.30 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో బీహార్ కు చెందిన రాహుల్, రాకేష్ అనే ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు.
ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 50 మంది కార్మికులు ఉన్నారని తెలిసింది. తీవ్రగాయాలైన కార్మికులను యశవంతపురంలోని ఆసుపత్రులకు తరలించారు. భవనంలో మౌల్డింగ్ పనులు జరుగుతున్నాయి.
మౌల్డింగ్ కోసం ఏర్పాటు చేసిన మట్టి దిబ్బలు కుప్పకూలడం వలనే ప్రమాదం జరిగిందని సమాచారం. గాయాలైన వారిలో నలుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన చికిత్స చేయిస్తున్నామని పోలీసులు అన్నారు. కేసు నమోదు చేసి రాకేష్, రాహుల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి విచారణ చేస్తున్నామని ఆర్ఎంసీ యార్డు పోలీసులు తెలిపారు.