వలంటీర్లపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగం: ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
పుణే: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఆక్స్ఫర్డ్ రూపొందిస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రయోగంపై అధికారులు తాజా సమాచారాన్ని వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న ఈ వ్యాక్సిన్ను తయారు చేయడానికి భారత్కు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందాలను కుదుర్చుకుంది. కోవిషీల్డ్ను తొలిసారిగా నెలరోజుల కిందట ఇద్దరు వలంటీర్లపై ప్రయోగించారు. 32, 48 సంవత్సరాల వయస్సున్న ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు తాజా ప్రకటన చేశారు. రెండోదశ ప్రయోగంలోనూ వారి ఆరోగ్యం బాగున్నట్లు వెల్లడించారు.
పరీక్షల షెడ్యూల్ సమీపిస్తోన్న వేళ: నీట్, జేఈఈ తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటీషన్: 6 రాష్ట్రాలు
మహారాష్ట్ర పుణేలోని భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో వారికి నెలరోజుల కిందట తొలిసారిగా వ్యాక్సిన్ ఇచ్చారు. రెండో దశలో బుధవారం మరోసారి వ్యాక్సిన్ ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు తెలిపారు. రెండోదశ వ్యాక్సిన్ను వేసిన తరువాత భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల డాక్టర్లు వారిని పలుమార్లు పరీక్షించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇద్దరు వలంటీర్లలో ఎలాంటి ఇతర దుష్ప్రభావాలు గానీ, జ్వరంగానీ సోకలేదని డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర ఒస్వాల్ తెలిపారు. రెండోదశ వ్యాక్సిన్ను ఇచ్చిన తరువాత సుమారు అరగంట పాటు వారిని వైద్య కళాశాలలో డాక్టర్ల పరిశీలనలో ఉంచారు.
అనంతరం వారిని ఇంటికి పంపించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తమకు వెంటనే తెలియజేయాలని సూచించామని అన్నారు. వారి నుంచి ఆందోళనకర సమాచారం ఏదీ రాలేదని జితేంద్ర చెప్పారు. గురువారం మరోసారి వారి ఆరోగ్యాన్ని పరీక్షించగా..ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని స్పష్టం చేశారు. దీనితో కోవిషీల్డ్ విజయవంతం అవుతుందనే నమ్మకం ఏర్పడుతోందని అన్నారు. ఇద్దరు వలంటీర్లపై చేసిన ప్రయోగాల ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటం వల్ల వచ్చే వారం రోజుల్లో ఈ వ్యాక్సిన్ను మరో 25 మందిపై ప్రయోగిస్తామని మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెల్ ఇన్ఛార్జి డాక్టర్ సొనాలి పాల్కర్ తెలిపారు.
Recommended Video
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ-అస్ట్రాజెనెకా సంయుక్తంగా కోవిషీల్డ్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా.. బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ. కోవిషీల్డ్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన కాంట్రాక్టును సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కుదుర్చుకుంది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకుని వస్తామంటూ సీరిమ్ ఇన్స్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అదర్ పునావాలా తెలిపారు. రెండు నెలల పాటు ఓపిక పట్టాలని సూచించారు. వచ్చే రెండు నెలల్లో కనీసం నాలుగు కోట్ల డోసుల మేర కోవిషీల్డ్ను ఉత్పత్తి చేయాలని సీరమ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.