అఖిలేశ్ తన తండ్రి మాటనే లెక్క చేయరు..జయంత్ మాట వింటారా? : అమిత్ షా
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అధికారం కోసం ఎత్తులుపై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రజలకు ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూ కదన రంగంలో దూసుకుపోతున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే ఈ యూపీ అసెంబ్లీ ఎన్నికలపైనే పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. తమ పట్టుకోసం సర్వ శక్తులా ఒడ్డుతున్నాయి.

జయంత్ గళం మునిగిపోతుంది..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టిన సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్పై కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరికి అఖిలేశ్ యాదవ్ నచ్చజెప్పి, తన కూటమిలో చేర్చుకోగలిగారు. కానీ, తన గళాన్ని వినిపించే అవకాశాన్ని జయంత్కు ఇవ్వరని ఆరోపించారు. యూపీలో ఒకవేళ సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే తన గళం మునిగిపోతుందని జయంత్కు తెలియడం లేదంటూ అమిత్ షా ఎద్దేవాచేశారు.

అఖిలేష్ తండ్రి మాటే వినరు..
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. తన తండ్రి, కుటుంబ సభ్యుల మాటను వినని వ్యక్తి అని అమిత్ షా ఆరోపించారు. అలాంటి వ్యక్తి జయంత్ చెప్పే మాటను ఎలా వింటారని ఎద్దేవా చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజం ఖాన్ జైలు నుంచి వచ్చి అఖిలేష్ యాదవ్ పక్కన కూర్చుంటారన్నారని విమర్శలు గుప్పించారు. ఎస్పీలో అవినీతి పరులకే చోటు ఉంటుందని ఆరోపణలు చేశారు.

రైతులకు రుణమాఫీ చేసింది బీజేపీ ప్రభుత్వమే
యూపీలో రైతులకు రుణమాఫీ చేసింది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా అన్నారు. బీఎస్పీ, ఎస్పీల పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీలో అలాంటివేమీ కనిపించడం లేదని అమిత్ షా పేర్కొన్నారు. మరోసారి కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీని గెలించాలన్నారు. అవినీతిలేని పాలన బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications