కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు మాఫియా డాన్ వార్నింగ్, హఫ్తా ఇస్తావా, లేదంటే ?ఐటీ దెబ్బ !
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ సభ్యుడు (కాంగ్రెస్) డీకే.
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ సోదరుడు, బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ సభ్యుడు (కాంగ్రెస్) డీకే. సురేష్ కు విదేశాల నుంచి మాఫియా డాన్ రవి పూజారి ఫోన్ చేసి మర్యాదగా అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తరువాత పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారని వెలుగు చూసింది.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ ను బెదిరించారని బెంగళూరులోని సదాశివ నగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. రాజ్యసభ ఎన్నికల సందర్బంగా గుజరాత్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్ లో పెట్టిన సమయంలో మంత్రి డీకే బ్రదర్స్ మీద ఆదాయపన్ను శాఖ దాడులు జరిగాయి.
బాలీవుడ్ స్టార్స్ టార్గెట్
ఆదాయపన్ను శాఖ దాడుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న డీకే. బ్రదర్స్ కు మరో సమస్య వచ్చి పడింది. సాధారణంగా మాఫియా డాన్ రవి పూజారి, అతని గ్యాంగ్ బాలీవుడ్ నటీ, నటులు, నిర్మాతలు, పలువురు సెలబ్రిటీలను బెదిరించి హఫ్తా వసూలు చేస్తుంటారు.
మీ బాస్ కు ఫోన్ ఇవ్వు
రవి పూజారి కన్ను ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పడింది. పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్ కార్యాలయానికి ఈనెల 8వ తేదీ విదేశాల నుంచి 14 నెంబర్ల కలిగి ఫోన్ నెంబర్ తో ఓ ఫోన్ కాల్ వచ్చింది. డీకే. సురేష్ పీఏ అరుణ్ దేవ్ ఫోన్ రిసీవ్ చేశాడు. నేను రవి పూజారి మాట్లాడుతున్నా, మీ బాస్ కు ఫోన్ ఇవ్వు అని చెప్పాడు.
మర్యాదగా చెప్పింది వినండి
డీకే. సురేష్ ఈగల్టన్ రిసార్ట్ లో ఉన్నారని అరుణ్ దేవ్ సమాధానం ఇచ్చాడు. మావాళ్లు వస్తారు, మేను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని, మీ బాస్ ను జాగ్రత్తగా ఉండాలని రవి పూజారి పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి హీందీ, ఇంగ్లీష్ బాషల్లో బెదిరించారని వెలుగు చూసింది.
ఐటీ దాడుల్లో ఆస్తులు చిక్కాయని ?
డీకే. సురేష్ ఫిర్యాదు చెయ్యడంతో సదాశివ నగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఐటీ శాఖ దాడుల్లో డీకే. బ్రదర్స్ కు చెందిన అనేక ఆస్తుల పత్రాలు, వ్యాపారాలు, కంపెనీలకు చెందిన పత్రాలను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
రూ. 10 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం
రెండు సంవత్సరాల క్రితం రవి పూజారి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి హెచ్ఎం. రేవణ్ణకు ఫోన్ చేసి రూ. 10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ డీకే. సురేష్ కు బెదిరింపులు వచ్చాయి.