నిండు సభలో ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం... శానిటైజర్ తాగి..ఏమైందంటే..?
ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా సభలో గందరగోళ వాతావరణం. సభలోని ఎమ్మెల్యేలంతా మరో ఎమ్మెల్యే చుట్టూ చేరారు.. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..?
ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఒడిషాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. చర్చ మొత్తం రైతులపై జరుగుతోంది. వరి కొనుగోలుపై సీరియస్గా చర్చ జరుగుతోంది. వరి కొనుగోలులో అక్రమాలు అవినీతి చోటు చేసుకుంటోందంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై మంత్రి రానేంద్ర ప్రతాప్ స్వైన్ సమాధానం ఇస్తుండగా సంతృప్తి చెందని బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర పాణిగ్రహి ఆత్మహత్యాయత్నం చేశారు. తన వద్ద ఉన్న శానిటైజర్ తీసుకుని అది తాగేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బిక్రమ్ కేసరీ.. సుభాష్ చంద్రను ప్రతిఘటించారు. ఈ ఘటన భోజన విరామం తర్వాత అసెంబ్లీ తిరిగి సమావేశమైన సందర్భంలో చోటు చేసుకుంది.
ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
ఇక బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ చంద్ర తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. తాము ఎన్ని చెప్పినప్పటికీ రాష్ట్రప్రభుత్వం లెక్కచేయడం లేదని ఇక వేరే మార్గం లేక ఆత్మహత్యే శరణ్యం అని భావించి ఈ ప్రయత్నం చేసినట్లు సమర్థించుకున్నారు. తాము బయటకు వెళ్లలేక ఉన్నామని చెప్పిన సుభాష్ చంద్ర... రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మీరేం చేస్తున్నారంటూ ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తానే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సుభాష్ చంద్ర వెల్లడించారు. డియోగఢ్ జిల్లాలోని 29 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల్లో వరి కొనుగోలు జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఏదైనా ప్రాణహాని జరిగి ఉంటే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వచ్చేదని చెప్పారు.
సభలో గందరగోళం సృష్టించిన విపక్షాలు
ఇక శుక్రవారం రోజున అసెంబ్లీ సమావేశం కాగానే కాంగ్రెస్ - బీజేపీ సభ్యులు స్పీకర్ వెల్ వద్దకు దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష పార్టీల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో స్పీకర్ గంటపాటు సభను వాయిదా వేశారు. మండీలకు వరిని పంపుతామని అసెంబ్లీలో ప్రకటన చేసిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత నరసింగ మిశ్రా ధ్వజమెత్తారు. రైతుల నుంచి వరి కొనుగోలు పూర్తిగా జరిగే వరకు సభను అడ్డుకుంటామని కాంగ్రెస్ విప్ తారాప్రసాద్ బాహినీపతి చెప్పారు. వరి కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి వెంటనే స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ కూడా కాంగ్రెస్తో గొంతు కలిపింది.
వరి కొనుగోలు చిట్టా చెప్పిన మంత్రి
ఇదిలా ఉంటే ఆహారసరఫరా మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ... ఫిబ్రవరి 26వ తేదీ నాటికి రాష్ట్రంలో 57.67లక్షల టన్నుల వరిని రిజిస్టర్ అయిన 10.53 లక్షల రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు సభకు వివరించారు. ఇక నిజమైన రైతుల జాబితాను ఎమ్మెల్యేలు సమర్పిస్తే ఆ జాబితా ప్రకారంగా రైతుల నుంచి వరిని కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. విచారణ చేయించిన తర్వాత వరి కొనుగోలు చేపడతామని మంత్రి ప్రకటన చేశారు.