స్మృతి ఇరానీకి షాక్: ట్రయల్ రూంలో రహస్య కెమెరా, ఫిర్యాదు
పనాజీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి షాక్ తగిలింది! గోవాలోని ఓ స్టోర్ రూంలో దుస్తులు కొనుగోలు చేసిన స్మృతి ఇరానీ అనంతరం వాటిని మార్చుకునేందుకు ట్రయల్ రూంకు వెళ్లారు. ట్రయల్ రూంలో ఆమె రహస్య కెమెరాలను గుర్తించారు.
దీంతో షాకైన స్మృతి ఇరానీ పోలీసులకు సమాచారం అందజేశారు. కేంద్రమంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ వెళ్లిన స్టోర్లోనే స్పై కెమెరాలు ఉండటం గమనార్హం. స్మృతి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు వెంటనే స్పందించారు. అలాగే, గోవాలోని మిగతా స్టోర్ రూంలలో ఇలాంటి స్పై కెమెరాలు ఉన్నాయా అని గుర్తించే పనిలో పడ్డారు.
స్మృతి ఇరానీ ప్రస్తుతం గోవాలో ఉన్నారు. సెలవులు గడిపేందుకు వెళ్లిన స్మృతి అక్కడి ఫ్యాబ్ ఇండియా అనే దుకాణంలో దుస్తులు కొనుగోలు చేశారు. ఆ దుకాణంలోని ట్రయల్ రూంలో ఆమెకు స్పై కెమెరా కనిపించింది.
మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన నేరం పైన పోలీసులు స్టోర్ యాజమాన్యం పైన కేసులు పెట్టారు. స్మృతి ఇరానీ ఈ విషయాన్ని తొలుత స్థానిక బీజేపీ నేత మేకేల్ లోబోకు చెప్పారు. అనంతరం స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు.