కేంద్ర మంత్రివర్గం నుంచి అప్పుడే ఒకరు అవుట్?
Suresh Gopi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని గంటల వ్యవధిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం సాయంత్రం కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఓ లోక్సభ సభ్యుడు.. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ పదవిలో కొనసాగకూడదనే నిర్ణయానికి వచ్చారు.
ఆయనే- సురేష్ గోపీ. ప్రముఖ మలయాళ నటుడు. మొన్నటి ఎన్నికల్లో కేరళలోని త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కేరళలో బోణీ కొట్టిన ఏకైక బీజేపీ లోక్సభ సభ్యుడు ఆయనే. సురేష్ గోపీ విజయం సాధించడంతో ఇక్కడ తన ఖాతాను తెరిచినట్టయింది బీజేపీకి.

ఈ క్రమంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు ప్రధాని మోదీ. సురేష్ గోపీని గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తానంటూ ఎన్నికల ప్రచార సమయంలో హామీ సైతం ఇచ్చారాయన. దీన్ని నిలబెట్టుకున్నారు. ఆయనతో పాటు బీజేపీ కేరళ రాష్ట్రశాఖ సీనియర్ నాయకుడు జార్జ్ కురియన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీనితో మోదీ కేబినెట్లో ఆ రాష్ట్రం నుంచి ఇద్దరికి ప్రాతినిథ్యాన్ని కల్పించినట్టయింది.
ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సురేష్ గోపీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను కేంద్ర మంత్రివర్గంలో కొనసాగదలచుకోలేదని అన్నారు. ఓ మలయాళం న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చేతిలో పలు సినిమాలు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.
త్రిశూర లోక్సభ నియోజకవర్గం ఓటర్లు తనపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించినందున ఎంపీగా కొనసాగుతానని తేల్చి చెప్పారు. తన నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలియజేశానని, తుది నిర్ణయం వారి చేతుల్లో ఉందని పేర్కొన్నారు. పార్టీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా దాన్ని పాటిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications