కాంగ్రెస్లో ఐకమత్యం ముఖ్యం.. ఎన్నికల ఫలితాలు నిరాశకు గురిచేశాయి : సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆపార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టిపెట్టారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. పంజాబ్లో అధికారాన్ని కోల్పోయింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ హస్తం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో అయితే రెండు స్థానాలకే పరిమితం అయింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్కు పునరుజ్జీవం తెద్దాం..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమను షాక్కు గురిచేశాయని, తీవ్రంగా బాధించాయని సోనియా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఎంతో నిరాశకు గురిచేశాయో తనకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పార్టీ పునరుజ్జీవం ప్రజాస్వామ్యానికి , సమాజానికి ముఖ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యాంగా చేసుకుని నాయకులను, కార్యకర్తలను భయాందోళలనకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శలు గుప్పించారు.

నేతల్లో ఐకమత్యం అవసరం..
కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఐకమత్యం ముఖ్యమని సోనియా గాంధీ నొక్కి చెప్పారు. నిబద్ధత, దృడ సంకల్పానికి ఇది పరీక్షా సమయమని పేర్కొన్నారు. గతంలో కన్నా సవాళ్లతో కూడుకుందన్నారు. పార్టీలో ఐకమత్యాన్ని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీలో అంతర్గత విబేధాలు పక్కన పెట్టి పార్టీ కోసం కృష్టి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు, కీలక నేతలు పాల్గొన్నారు.

పరాజయంపై కాంగ్రెస్ మేధోమథనం
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడంపై రాష్ట్రాల వారిగా త్వరలో మేధోమథనం జరగనుంది. మరో ఏడాదిలో కర్ణాటక, గుజరాత్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో పార్టీ బలోపేతంపై సోనియా గాంధీ దృష్టిపెట్టారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పార్టీ పరిస్థితిపై ఇతర నేతలతో కూడా మాట్లాడానని, బలోపేతం చేయడంపై సలహాలు కూడా తీసుకున్నామని సోనియా తెలిపారు. పార్టీలో పక్షాళన అవసరం అని గతంలో సోనియాకు 23 మంది కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ అజాద్, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ ఇటీవల సోనియా గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే.. ఎన్నికల్లో ఘోర పరాజయానికి ప్రధాన కారణం పార్టీలో అంతర్గత కలహాలే కారణమని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించే విధంగా నేతలంతా ఐక్యతగా ఉండాలని సోనియా స్ఫష్టం చేశారు.












Click it and Unblock the Notifications