ఇంత దారుణమా?: సానుభూతి ఓట్ల కోసం సోదరుడినే హత్య చేయించాడు, చివరికి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తనకు సానుభూతి ఓట్లు వస్తాయనే నెపంతో సొంత సోదరుడిని, స్నేహితుడిని కూడా చంపించాడు ఓ దుర్మార్గుడు.
మీరట్: రాజకీయ నాయకులు తమకు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారానే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తనకు సానుభూతి ఓట్లు వస్తాయనే నెపంతో సొంత సోదరుడిని, స్నేహితుడిని కూడా చంపించాడు ఓ దుర్మార్గుడు. చివరకు నేరుం రుజువు కావడంతో జైలు పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే..యూపీలోని ఖుర్జా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్ ఎల్డీ అభ్యర్థిగా మనోజ్ కుమార్ గౌతమ్ పోటీ చేస్తున్నాడు. ఆయన తొలుత బీఎస్పీ టికెట్ కోసం ప్రయత్నించాడు. టికెట్ లభించకపోవడంతో ఆర్ఎల్డీ తరఫున బరిలో దిగాడు. కుటుంబ సభ్యుడిని చంపించి, రాజకీయ ప్రత్యర్థులు ఈ హత్య చేయించినట్టు ఆరోపించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని పథకం వేశాడు.
సోమవారం ఖుర్జాలో ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ కొడుకు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయంత్ చౌదరి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇదే అదునుగా భావించిన గౌతమ్.. ఈ ర్యాలీ ముగిసిన వెంటనే తన సోదరుడు వినోద్, స్నేహితుడు సచిన్లను చంపించాడు. కిరాయి హంతకులు వీరిద్దరిని తుపాకీతో కాల్చి చంపారు. ఓ మామిడి తోటలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా గౌతమే ఈ హత్యలు చేయించినట్టు తేలింది. కాగా, పోలీసుల విచారణలో గౌతమ్ ఏడుస్తూ ఏమీ తెలియనట్టుగా నటించినా.. తర్వాత నిజం అంగీకరించాడు. ఇద్దరు కిరాయి హంతకులకు లక్ష రూపాయలు ఇచ్చి, హత్యలు చేయించినట్టు ఒప్పుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గౌతమ్ తోపాటు ఓ కిరాయి హంతకుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో హంతకుడి కోసం గాలింపు చేపట్టారు.