ఘోర ప్రమాదం: బాయిలర్ పేలుడుతో 8 మంది మృతి, 15 మందికి గాయాలు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. హాపూర్ జిల్లాలోని ధౌలానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలక్ట్రానిక్ వస్తువల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. పేలుడు దాటికి పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.
యూపీ సీఎం యోగి దిగ్భ్రాంతి
బాయిలర్ పేలు పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మీరట్ ఐజీ ప్రవీణ్ కుమార్, హాపుడ్ డీఎం సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద ఘటనపై హాపూర్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. హాపూర్లోని ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.