అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ..యోగి సర్కార్లో పెను మార్పులు: ఆర్ఎస్ఎస్ మార్క్
లక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతోందీ రాష్ట్రం. సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయానికి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఉంటుంది కూడా. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే రాజకీయంగా, అధికారపరంగా పావులు కదుపుతోంది. వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి వస్తామంటూ కేంద్రమంత్రులు చేస్తోన్న ప్రకటనలు.. సాగిస్తోన్న వరుస సమీక్షలు- ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల వేడిని రగిల్చినట్టయింది.

11 గంటలకు రాజ్భవన్లో..
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. తన మంత్రివర్గాన్ని విస్తరించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇందులో భాగంగా- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ ఇన్ఛార్జ్ రాధా మోహన్ సింగ్.. కాస్సేపట్లో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ను కలుసుకోనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన రాజధాని లక్నోలోని రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమౌతారు. దీనితో- మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ తుది అంకానికి వచ్చినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఆర్ఎస్ఎస్ ముద్ర..
మంత్రివర్గ విస్తరణకు అవసరమైన ముహూర్తాన్ని ఖాయం చేసుకోవడానికే రాధామోహన్ సింగ్.. గవర్నర్ను కలుస్తున్నారని చెబుతోన్నారు. ఇంకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున.. దాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని అంటున్నారు. రాజకీయంగా బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంకును కలిగి ఉన్న ఎమ్మెల్యేలను కేబినెట్లో తీసుకుంటారని సమాచారం. కొత్త మంత్రివర్గం మీద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముద్ర ఉండొచ్చని భావిస్తున్నారు.

సీనియర్లకు నో ఛాన్స్..
ఇటీవలే బీజేపీ-ఆర్ఎస్ఎస్ భేటీ కావడం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం ఇందులో చర్చకు రావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. కొద్దిరోజుల కిందటే యోగి ఆదిత్యనాథ్ కూడా గవర్నర్తో సమావేశమైన విషయం తెలిసిందే. వన్ టు వన్గా సాగిందీ భేటీ. పలు కీలక అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో అయిదుమంది కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. అలాగే ఏడుమంది సీనియర్లను తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది.
Recommended Video

ప్రధాని నమ్మకస్తుడికి డిప్యూటీ..
యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని ముగ్గురు మంత్రులు చేతన్ చౌహాన్, కమలా రాణి, విజయ్ కశ్యప్ కరోనా బారినపడి మరణించారు. ముగ్గురు మంత్రులు వేర్వేరు కారణాలతో రాజీనామాలు చేశారు. వారి స్థానాలను భర్తీ చేయడంతో పాటు- కొత్త వారికి చోటివ్వబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో కొత్తగా శాసన మండలికి ఎన్నికైన మాజీ ఐఎఎస్ అధికారి ఏకే శర్మను ఉప ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆప్తుడిగా ఆయనకు పేరుంది. వాటన్నింటినీ క్రోడీకరించిన తరువాతే.. మంత్రివర్గ జాబితా సైతం సిద్ధమైందని, అందుకే రాధామోహన్ సింగ్ గవర్నర్తో భేటీ కానున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications