UP Elections 2022: బీఎస్పీ ఏనుగు గతంలో రాష్ట్రంలో రేషన్ అంతా తినేసింది: యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్వాదీ పార్టీ (ఎస్పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు వారిని ఆదరించబోరు అని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రతిపక్ష నాయకులపై మాటల తూటాలు పేల్చారు. గత ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీలో మళ్ళీ అధికారంలోకి బీజేపీనే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల తప్పులను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గత బీఎస్పీ హయాంలో రాష్ట్ర రేషన్ యొక్క తప్పుడు నిర్వహణపై బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి)ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు యోగి ఆదిత్యనాథ్. సుల్తాన్పూర్లో జరిగిన ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, "ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్రకటించబడతాయని పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ జరిగిందని, ఐదో విడత పోలింగ్ జరగాల్సి ఉందని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష నాయకులందరూ మార్చి 11న రాష్ట్రం విడిచి వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.
మాయావతి నేతృత్వంలోని బీఎస్పీపై దాడి చేస్తూ బీఎస్పీ ఏనుగు కడుపు ఎంత పెద్దదంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ వారే తినేశారని ఆరోపణలు గుప్పించారు. అంతకుముందు అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరాన్ని యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధినేత జేపీ నడ్డా కూడా గతంలో అయోధ్యలోని ఆలయ స్థలాన్ని సందర్శించారు. రామమందిర నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఏడు దశల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 27 న జరగనున్న ఐదవ దశ ఎన్నికలు ప్రధానంగా అయోధ్య, రాయ్ బరేలీ మరియు అమేథీ జిల్లాలతో సహా తూర్పు ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అర్బన్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్కు ముందు, సమాజ్వాదీ పార్టీ హయాంలో అల్లర్లను గుర్తుచేసి, వారిని మాఫియా అని ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం నాడు మండిపడ్డారు.
మీకు ఎలాంటి ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోండి, అల్లర్లను సృష్టించే ప్రభుత్వం కావాలా, వాటి నుండి మిమ్మల్ని విడిపించి పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం కావాలా అని ఆదిత్యనాథ్ బారాబంకిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.