విషాదం : కరోనాతో మంత్రి కన్నుమూత... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి...
ఉత్తరప్రదేశ్ మంత్రి హనుమాన్ మిశ్రా మంగళవారం(ఏప్రిల్ 20) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన... లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోమవారం(ఏప్రిల్ 19) బిహార్ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనాతో మృతి చెందారు.
దేశంలో ప్రస్తుతం మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 28,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో... కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతీ శని,ఆదివారాలు వీకెండ్ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఈ లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
లాక్డౌన్ సమయంలో కేవలం అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.

కాగా,అలహాబాద్ హైకోర్టు.. ప్రయాగ్రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరక్పూర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటినీ మూసివేయాలని, లాక్డౌన్ విధించాలని ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కట్టడికి లాక్డౌన్ పరిష్కారం కాదని... దాని ద్వారా చాలామంది బతుకుదెరువు కోల్పోతారని హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రభుత్వం ఆ వాదనతో ఏకీభవించలేదు. లాక్డౌన్ అమలుచేయాల్సిందేనని ఆదేశించింది. దీంతో యోగి సర్కార్ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. యోగి సర్కార్ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు... హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు మళ్లీ కర్ఫ్యూలు,లాక్డౌన్స్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ కొనసాగుతుండగా... ఢిల్లీలో వారం రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక తెలంగాణలో నేటి రాత్రి నుంచే కర్ఫ్యూ అమలులోకి రానుంది. తమిళనాడు,బిహార్ రాష్ట్రాలు కూడా ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications